ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జూన్ నుంచి కొత్త మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 06:41 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేషన్ సరుకుల పంపిణీ విధానంపై చర్చించారు. అనంతరం జూన్ నుంచి రేషన్ సరుకులను రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ పూర్తైన అనంతరం.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను వెల్లడించారు. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. అలాగే ఏపీలో రేషన్ వ్యాన్లు ఇకపై ఉండవని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ జరుగుతుందని ఆయన వివరించారు.


ఏపీలో గతంలో చౌకధరల దుకాణం (రేషన్ షాపులు) ద్వారా రేషన్ పంపిణీ చేసేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ సరుకుల కోసం షాపుల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (MDU) వాహనాల ద్వారా రేషన్ పంపిణీని 2021 జనవరి 21న వైఎస్ జగన్ ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలను ఉపయోగించి రేషన్ కార్డుదారులకు నేరుగా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, ఇతర రేషన్ సరుకులను అందజేస్తూ వచ్చారు.


అయితే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ప్రభుత్వానికి భారమని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎండీయూ వాహనాల కొనుగోలు, నిర్వహణ కోసం ఆర్థిక భారం పడుతోందని.. రేషన్ సరుకుల పంపిణీ సమయంలో మాత్రమే ఎండీయూ వాహనాలు వాడుకలో ఉంటున్నాయని.. మిగతా సమయాల్లో ఎండీయూ వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయనేది టీడీపీ కూటమి ప్రభుత్వం వాదన. అలాగే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీతో వేల మంది రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోతున్నారని రేషన్ డీలర్ల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇళ్ల వద్దే రేషన్‌ సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. వాహనాల ద్వారా అయితే అప్పుడు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని.. అదే దుకాణాలు అయితే నిత్యం అందుబాటులో ఉంటాయని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa