ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క టికెట్‌తో సరస్వతి పుష్కరాలతోపాటు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 06:44 PM

సరస్వతి పుష్కరాలకు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఉన్న త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు.. మే 26వ తేదీ వవరకు కొనసాగనున్నాయి. పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఏపీఎస్‌ఆర్టీసీ కూడా పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.


పుష్కరాల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ.. రాజమండ్రి, అమలాపురం తదితర ప్రధాన డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ క్రమంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీభారీ ఆఫర్ ప్రకటించింది. ఒక్క టికెట్ తీసుకుంటే.. ఇటు పుష్కరాల్లో పాల్గొనడమే కాక.. తెలంగాణలోని ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించేందుకు రెడీ అయ్యింది. మూడు రోజుల పాటు ఈ ట్రిప్ సాగనుంది. 3 రోజులకు గాను ఒక్క టికెట్ తీసుకుంటే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు.


పుష్కరాలతో పాటు 6 పుణ్యక్షేత్రాల దర్శనం..


దీనిలో భాగంగా పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు.. రాజమండ్రి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ఎక్కితే.. సరస్వతి పుష్కరాలతో పాటు కాళేశ్వరం ఆలయ దర్శనం, ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టులో ఆంజనేయస్వామి, వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి, వరంగల్‌లో భద్రకాళీమాత, రామప్ప దేవాలయాలను దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. పుణ్యక్షేత్రాల సందర్శన అయిపోయిన తర్వాత.. వారిని తిరిగి గమ్యస్థానానికి చేరుస్తారు.


భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే.. ఇందుకు సంబంధించిన టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. టికెట్ ధర, టైమింగ్ వివరాలకు వస్తే.. ఈ స్పెషల్ బస్సు.. రాజమండ్రి డిపో నుంచి మే 22వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు బయలుదేరుతుంది. ఇది సూపర్ లగ్జరీ స్పెషల్ బస్ సర్వీసు. ఇందులో ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 2,173గా ఉంది. అయితే మార్గమధ్యలో భోజనం, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.


ఇక అమలాపురం నుంచి పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం.. స్పెషల్ బస్సు మే 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుంది. ఇది కూడా సూపర్ లగ్జరీ సర్వీసే. ఈ బస్సులో ఒక్క టికెట్ ధర రూ. 2,173గా ఉంది. ఒక్క టికెట్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణం చేసేందుకు వీలవుతుంది. అలానే అమలాపురం డిపోకు చెందిన ఏసీ సెమీ స్లీపర్ సర్వీసు మే 22వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరుతుంది. ఇందులో టికెట్ ధర రూ. 2,515గా ఉంది.


ఎలాగు వేసవి సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల భక్తులు ఈ సర్వీసును వినియోగించుకుంటే.. ఇటు పుష్కర స్నానంతో పాటుగా.. మిగతా పుణ్యక్షేత్రాలను కూడా సులువుగా దర్శించుకుని.. తిరిగి ఇంటికి చేరవచ్చు అంటున్నారు అధికారులు. మరి మీరు కూడా పుష్కరాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే.. ఈ సర్వీసులపై ఓ లుక్కేయండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa