ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ ఖనిజ సంపదపై సీఎం హిమంత బిశ్వ శర్మ షాకింగ్ కామెంట్లు

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:24 PM

పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దోచుకుంటున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, భారీగా ఖనిజ సంపద ఉన్నా.. పాకిస్థాన్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌ను దశాబ్దాల నాటి నుంచి పాక్ పాలకులు ఆర్థికంగా, రాజకీయంగా దోచుకుంటున్నారని హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌పై ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు పోస్టు పెట్టారు.


"బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ ఆ ప్రాంతం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతోంది. దశాబ్దాల నాటి నుంచి బలూచిస్థాన్ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ దోపిడీ ఎక్కువ అయింది. పాకిస్థాన్‌లోని మొత్తం ఖనిజ సంపదలో 80 శాతానికిపైగా బలూచిస్థాన్‌లోనే ఉంది, అయినా పాకిస్థాన్ పాలకులు పట్టించుకోవడం లేదు. అక్కడ భారీగా రాగి, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి కూడా ఉంది" అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పోస్టులో పేర్కొన్నారు.


బలూచిస్థాన్‌లో సుయ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు 1952లో కనుగొన్నారని, 2020 నాటికి పాకిస్థాన్‌కు సుమారుగా 56 శాతం సహజ వాయువును బలూచిస్థాన్ ప్రావిన్సే అందిస్తోందని హిమంత బిశ్వ శర్మ చెప్పుకొచ్చారు. బలూచిస్థాన్లోని గ్వదర్ పోర్టు 770 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగు నీరు, విద్యుత్, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని అన్నారు. ప్రభుత్వ రంగ ఉపాధిలో బలూచిస్థాన్ ప్రాంతం వాటా కూడా చాలా తక్కువగా ఉందని హిమంత పేర్కొన్నారు.


బలూచిస్థాన్ ప్రాంతం ఖనిజ పుట్టెడు సంపదతో నిండిపోయి ఉంటే, అక్కడ నివసించే ప్రజలు మాత్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. బలూచిస్థాన్ ప్రాంతంలో వనరుల కొరత లేదని, పాలకుల నిర్లక్ష్యం మాత్రం తీవ్రంగా ఉందన్నారు. దాని వల్లే ఆ ప్రాంతం తీవ్రంగా దోపిడీకి గురవుతున్నట్లు హిమంత బిశ్వశర్మ తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంరం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా మరోవైపు బలోచిస్థాన్ కూడా స్వాతంత్రం కోసం పాకిస్థాన్‌తో పోరాడుతోంది. ముఖ్యంగా బలూచిస్థాన్ రచయిత మీర్ యార్ బలూచ్.. బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. త్వరలోనే తమ కొత్త దేశం స్వాతంత్ర్య వేడుక కూడా జరుగుతుందని.. మిత్ర దేశాల అధినేతలు తమ దేశానికి వచ్చి జాతీయ కవాతును వీక్షించాలని, ఆశీర్వదించాలని కోరారు. కానీ వీటిపై ఇప్పటి వరకు ఏ ఒక్క దేశమూ స్పందించలేదు. అలాగే పాకిస్థాన్ కూడా అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa