అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, అణు శాస్త్రవేత్త మాలూరు రామస్వామి శ్రీనివాసన్ సోమవారం రోజు ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం 95 ఏళ్ల వయసు కల్గిన ఆయన వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయన మృతి విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంఆర్ శ్రీనివాసన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాకుండా ఆయన దేశానికి అందించిన సేవలను కూడా గుర్తు చేశారు. కీలకమైన అణు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఎంఆర్ శ్రీనివాసన్ 1930 జనవరి 5వ తేదీన బెంగళూరులో జన్మించారు. అయితే చదువుపై ఎప్పుడూ ఆసక్తి కనబర్చే ఈయన తొలి నుంచే బాగా చదివేవారు. ముఖ్యంగా ఫిజిక్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. అందుకే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న ఆయన 1950లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1952లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కెనడాలోని మాంట్రియల్లో ఉన్న మెక్గిల్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. అలాగే గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్పెషలైజేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అనేక స్థాయిల్లో పని చేసుకుంటూ వచ్చి 1984వ సంవత్సరంలో న్యూక్లియర్ పవర్ బోర్డు ఛైర్మన్ అయ్యారు. ఈ పదవిలో ఉండగానే దేశంలోని అన్ని పవర్ ప్రాజెక్టుల ప్లానింగ్, ఆపరేషన్స్ ఈయనే చూసుకునేవారు.
ముఖ్యంగా 1987లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్గా, అణు ఇంధన శాఖ కార్యదర్శిగా కూడా ఎంఆర్ శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఆ తర్వాత దేశంలో 18 న్యూక్లియర్ పవర్ యూనిట్లను అభివృధ్ధి చేసి దేశం కోసం ఎన్నో సేవలు అందించారు. అయితే ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 1984లో పద్మశ్రీతో సత్కరించింది. ఆపై ఆరేళ్లకు అంటే 1990లో పద్మభూషణ్ ఇక 2015లో పద్మ విభూషణ్ కూడా ఇచ్చి గౌవరించింది. అయితే వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, ఆయన అభిమానులు.. శ్రీనివాసన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎంఆర్ శ్రీనివాసన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన భార్య, కుమార్తెకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వీరికి మాత్రమే కాకుండా ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు కూడా కోలుకోవడానికి ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో ప్రముఖుడైన డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ దేశానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఈయన వల్లే భారత్.. ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి పునాది వేశారని కొనియాడారు. అలాగే అణుశక్తి కమిషన్కు ఆయన స్ఫూర్తిదాయక నాయకత్వం వహించారని చెప్పారు. ఈయన సేవలు ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa