ట్రెండింగ్
Epaper    English    தமிழ்

75 బుల్డోజర్ల ఎంట్రీ.. 2500 ఇళ్లు నేలమట్టం

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:39 PM

ఆక్రమణలపై ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఆక్రమణల గురించి ఫిర్యాదు అందితే చాలు.. బుల్డోజర్లు రంగంలోకి దిగుతున్నాయి. ఆక్రమణలను నేలమట్టం చేస్తున్నాయి. మన దగ్గర ఆక్రమణల విషయంలో హైడ్రా ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోచోట కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా 2500 ఇళ్లను కూల్చి వేయడానికి 75 బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఆ వివరాలు..


ఈ సంఘటన గుజరాత్, అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. అక్రమ నిర్మాణాలపై అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. గతంలో మొదటి దశలో భాగంగా 3 వేల ఇళ్లను ఇలానే నేలమట్టం చేయగా.. రెండో దశలో భాగంగా తాజాగా 2,500 ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకు గాను 75 బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. అధికారులు మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో ఉన్న ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు రంగంలోకి దిగారు.


ఈ నిర్మాణాల్లో ఎక్కువ భాగం.. బంగ్లాదేశీయులవే అంటున్నారు అధికారుల. వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడమే కాక.. ఇక్కడ ఇంటి నిర్మాణాలు కూడా చేసుకున్నారని తెలిపారు. మొదటి దశంలో భాగంగా ఏప్రిల్ 29, 30 తేదీల్లో3 వేల ఇళ్లను కూల్చి వేశారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా మరో 2,500 ఇళ్లను నేలమట్టం చేసేందుకు రెడీ అయ్యింది సర్కార్.


అక్రమ నిర్మాణాలను తొలగించి.. భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. కూల్చివేతలు సజావుగా సాగేందుకు 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. అలానే కూల్చివేతల సమయంలో అల్లర్లు, ఆందోళనలు చెలరేగకుండా.. శాంతిభద్రతలను కాపాడటానికి ఏకంగా 8వేల మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి.


నివేదికల ప్రకారం.. చందోలా సరస్సు చాలా కాలంగా పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారులకు నిలయంగా మారినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు దశబ్దాల క్రితం అనగా సుమారు 1970-80 సమయం నుంచే ఈ ప్రాంతంలో ఆక్రమణలు మొదలయ్యాయి. 2002లో ఒక ఎన్‌జీఓ ఇక్కడ సియాసత్ నగర్ అనే స్థావరాన్ని స్థాపించడానికి సహాయం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, నకిలీ డాక్యుమెంటేషన్ నెట్‌వర్క్‌లకు హాట్‌స్పాట్‌గా మారిందని అధికారులు వెల్లడించారు.


2010-2024 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు భారీగా పెరిగాయి. సరస్సు సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేలాది తాత్కాలిక ఇళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గత కొన్ని వారాలుగా గుజరాత్ పోలీసులు వేలాది మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది అహ్మదాబాద్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అధిక సంఖ్యలో చందోలా సరస్సు ఆక్రమణ మండలాల్లో నివసిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అధికారుల ప్రకారం.. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రభుత్వ భూమిని తిరిగి పొందడం మాత్రమే కాదు, చట్టవిరుద్ధమైన వలసలను అరికట్టడం మాత్రమే కాక, మురికివాడల ముసుగులో పనిచేస్తున్న నేరస్థుల నెట్‌వర్క్‌లను నిర్మూలించడం కూడా అని అధికారులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa