ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతల రోడ్లతో తీవ్ర అనారోగ్య సమస్యలు.. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ నోటీసులు

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:38 PM

బెంగళూరులోని రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఎక్కడ చూసిన రోడ్లన్నీ పాడైపోయి, గుంతలు పడగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ప్రతీరోజు ద్విచక్రవాహనాలు నడిపే వారికి మాత్రం అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందరిలాగే ఓ వ్యక్తికి కూడా తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చింది. దీంతో అనేక ఆస్పత్రులకు తిరిగినా ఫలితం మాత్రం లేకపోయింది. కేవలం వెన్నునొప్పే కాకుండా మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాగా.. మానసికంగానూ కుంగిపోయాడు. ఇందుకు కారణం గుంతలు పడ్డ రోడ్లేనని గుర్తించి బృహత్ బెంగళూరు మహానగర పాలికకు రూ.50 లక్షల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపాడు.


బెంగళూరులోని రిచ్‌మండ్ టౌన్‌లో నివాసం ఉండే 45 ఏళ్ల దివ్య కిరణ్.. స్థానిక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ.. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని వెల్లడించాడు. ముఖ్యంగా బీబీఎంపీ రోడ్ల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. రోడ్లన్నీ పూర్తిగా నాశనం అయినా, గుంతలు పడినా అసలు లెక్కచేయట్లేదని, కనీసం వాటిని బాగు చేయించడం కూడా చేయట్లేదని వెల్లడించాడు. దీని ఫలితంగా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నాడు. ముఖ్యంగా తాను ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపైనే ఆఫీసుకు వెళ్తుంటానని దివ్య కిరణ్ స్పష్టం చేశాడు.


దీంతో రోడ్లపై గుంతలు ఉండడం వల్ల తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందని.. ఇది మాత్రమే కాకుండా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయని వివరించాడు. వీటిని తగ్గించుకునేందుకు ఆస్పత్రులకు వెళ్లే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయే తప్ప తన సమస్య మాత్రం తీరలేదని అన్నాడు. ముఖ్యంగా మెడ, వెన్ను నొప్పి వల్ల తాను ఆర్థోపెడిక్ వైద్యుడి వద్దకు ఐదు సార్లు, ఫిలోమినా ఆసుపత్రిలో నాలుగు సార్లు అత్యవసర చికిత్స తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక ఇంజెక్షన్లు, మందులు కూడా తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ నొప్పులు రావడానికి కారణం గుంతలు పడ్డ రోడ్లేనని కూడా వైద్యులు ధ్రువీకరించారని దివ్య కిరణ్ చెప్పుకొచ్చాడు.


ఈ మేరకు తాను న్యాయవాది కేవీ లవీన్‌ను కలిశానని.. తన అభ్యర్థన మేరకు న్యాయవాది మే 14వ తేదీన బీబీఎంపీకి ఈ నోటీసులు పంపినట్లు చెప్పాడు. 15 రోజుల్లోగానే తనకు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించడంతో పాటు లీగల్ ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నాడు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. అయితే ఇప్పటి వరకు ఈ నోటీసులపై బీబీఎంపీ స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa