కర్ణాటక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో రూ.30 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలు జరిపే వ్యక్తుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ (నిర్దిష్ట ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్) తప్పనిసరిగా సేకరించాలని.. కర్ణాటకలోని అందరు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కర్ణాటక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చాలామంది సబ్ రిజిస్ట్రార్లు ఈ వివరాలను అందించడంలో అలసత్వం వహించారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ సమయంలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు ఇతర లావాదేవీల సమాచారాన్ని సమర్పించని పక్షంలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు అందించరు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285BA(1) ప్రకారం.. స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమర్పించడం తప్పనిసరి. అయితే కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఈ స్టేట్మెంట్లను అందించడం లేదని ఐటీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ఇన్స్పెక్టర్ జనరల్, స్టాంపుల కమిషనర్ కే.ఎ. దయానంద జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. సబ్ రిజిస్ట్రార్లు పాన్ కార్డ్ వివరాలు.. కొనుగోలుదారులు, విక్రేతల చిరునామాలు.. రిజిస్ట్రేషన్ తేదీ, లావాదేవీ విలువ, ఆస్తి వివరాలు, చెల్లింపు పద్ధతి, ఆధార్ వివరాలు, ఫారం 60 రసీదు, పుట్టిన తేదీ, సంప్రదింపు సమాచారం, ఈ-మెయిల్ వంటి వివరాలు సేకరించాలి. కొనుగోలుదారులు, విక్రేతలు ఈ వివరాలను ధృవీకరించి సంతకం చేయాలని.. స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఫారం ఇతర ఆస్తి లావాదేవీల పత్రాలతో పాటు స్కాన్ చేయాలి.
నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి.. స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఫోరం వివరాలను సేకరించిన తర్వాతే సంబంధిత వ్యక్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ పత్రాలను విడుదల చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సూచించారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఈ వివరాలను క్రమం తప్పకుండా అందిస్తున్నప్పటికీ.. తాజాగా ఆదేశాలు జారీ చేయడం వల్ల దీని ప్రాముఖ్యతను మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయడం లేదా అమ్మితే లావాదేవీ విలువ రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. లేదా చట్టంలోని సెక్షన్ 50సీ ప్రకారం ఆస్తి విలువ రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని తెలపాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa