ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి రాగా గత నాలుగైదు రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముంబై వంటి నగరాలు అయితే పూర్తిగా వరదలతో నిండిపోయాయి. అక్కడక్కడా చెట్లు పడిపోయి, స్తంభాలు కూలి, శిథిలమైన భవనాలు కూడా కూలిపోయి 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమే అని తెలుస్తోంది. అసలు సినిమా అంతా ముందే ఉంది. ఎందుకంటే శనివారం రోజు నుంచే పెద్ద ఎత్తున వర్షాలు కురవబోతున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుండగా.. పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరాలకు ప్రయాణాల కోసం వెళ్లే వారికి ఐఎండీ పలు సూచనలు చేసింది.
మే 24వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు మొత్తం పశ్చిమ తీరంలో భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతారవణ శాఖ వెల్లడించింది. ఈక్రమంలనే హిమపాతాలు, ఆకస్మిక వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అందుకే ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీలైనంత వరకు ఇప్పుడు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని స్పష్టం చేసింది.
కోస్తా కర్ణాటక, కేరళ, మధ్య మహారాష్ట్రతో పాటు అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించింది. ముంబైకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తాజాగా IMD కొంకణ్, గోవా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది.
తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD గురువారం సాయంత్రం తెలిపింది. దీని కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మహారాష్ట్ర, గోవాలోని చాలా తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి వారాంతం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
దక్షిణ కొంకణ్-గోవా తీరం సమీపంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడుగా పై నుంచి గాలులు కూడా వీస్తున్నాయి. దీని వల్ల మేఘాలు దట్టంగా ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అతి తీవ్రమైన ఉష్ణ ప్రవాహం ఉందని, ఇది తుఫాను ఏర్పడటానికి సూచన అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa