ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడుకున్న వ్యక్తిని చూడకుండా మట్టిపోసి చంపేశారు

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:58 PM

పారిశుద్ధ్య కార్మికులు చేసిన ఓ నిర్లక్ష్యపు పని వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా ఎండలో కూరగాయలు అమ్మీ, అమ్మీ అలిసిపోయిన అతడు కాసేపు సేద తీరాలనుకున్నాడు. వెళ్లి పడుకున్నాడు. రోజంతా కష్టపడడం వల్లేమో కళ్లు మూయగానే నిద్ర పట్టేసింది. అయితే ఇతడు పడుకున్నది చూడకుండా.. పారిశుద్ధ్య కార్మికులు ఓ ట్రాక్టర్ లో మట్టి తీసుకు వచ్చి అతడిపై పోసేశారు. బాగా నిద్రలో ఉన్న అతడికి అది పోస్తున్నట్లు తెలియకపోవడంతో.. నిద్రలోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగందంటే?


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో మున్సిపల్ కార్మికుల నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. మున్సిపల్ అధికారులు, కార్మికుల ఏమరపాటు ఒక వ్యక్తి సజీవ సమాధి చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బరేలీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్మికులు కాల్వ శుభ్రం చేశారు. అందులోని పూడికతీశారు. ఆ బురదనంతా ఒక ట్రాలీలో తీసుకువచ్చి చెట్టు వద్ద పారబోశారు. అయితే అదే చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని వారు గమనించలేదు. ట్రాలీ లోడు బురద ఒక్కసారిగా మీద పడిపోవడం, ఊపిరి ఆడకపోవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.


45 ఏళ్ల సునీల్‌గా గుర్తింపు..


స్థానికులు గమనించి బురదను తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బురద మట్టిని తొలగించి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో భారీ స్థాయిలో బురద మట్టి పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికులు 45 ఏళ్ల సునీల్‌గా గుర్తించారు. అతడు కూరగాయాలు అమ్ముతుంటాడని స్థానికులు తెలిపారు. కూరగాయలు అమ్మి వచ్చిన సునీల్, తన ఇంటికి దగ్గర ఉన్న చెట్టు కింద కాసేపు సేదతీరుదామని వచ్చి నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే మున్సిపల్ సిబ్బంది ట్రాలీలో బురద మట్టిని తీసుకురావడం, చెట్టు కింద నిద్రిస్తున్న సునీల్‌పై వేయడం జరిగిపోయింది.


ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, కార్మికుల నిర్లక్ష్యంపై కోపోద్రిక్తులవుతున్నారు. ఏమాత్రం చూసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంతో ఒకరి ప్రాణాలు తీశారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బరేలీ మున్సిపల్ ఉన్నతాధికారులు.. దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa