బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. మరో ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్లో కూటమిగా అధికారం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను ప్రభుత్వాన్ని నడపలేనంటూ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది. అయితే మహ్మద్ యూనస్ తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్.. ఆ పదవిలోకి రాబోతున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతేడాది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నుంచి షేక్ హసీనా పదవి కోల్పోక ముందు రెండు నెలల క్రితం జూన్ 23వ తేదీన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా వకార్ ఉజ్ జమాన్ నియమితులయ్యారు. అయితే వకార్ పాక్ అనుకూల వ్యక్తి అని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని.. షేక్ హసీనాకు భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నతస్థాయి అధికారులు ముందే హెచ్చరించినా ఆమె వినకుండా అతడికే ఆర్మీ చీఫ్ పగ్గాలు అప్పగించారు.
59 ఏళ్ల వకార్ ఉజ్ జమాన్ 40 ఏళ్లుగా సైన్యంలో ఉన్నారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్గానూ, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గానూ పనిచేశారు. బంగ్లాదేశ్ ఆర్మీని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషించిన వకార్ ఉజ్ జమాన్.. చేసిన సేవలను గుర్తించిన షేక్ హసీనా సర్కార్.. గతేడాది జూన్లో 3 ఏళ్ల పదవీకాలంపై ఆర్మీ చీఫ్గా నియమించింది. అయితే ఈ పదవిలో నియామకం అయిన కొన్ని రోజుల్లోనే బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆ నిరసనలను ఆపాల్సిన ఆయన.. షేక్ హసీనాకు అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే వకార్ ఉజ్ జమాన్.. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ముస్తఫిజుర్ రెహమాన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ముస్తఫిజుర్ రెహమాన్ షేక్ హసీనాకు వరసకు మామ అవుతారు. అంటే వకార్ ఉజ్ జమాన్.. షేక్ హసీనాకు సోదరుడి వరస అవుతారు.
యూనస్, జమాన్ మధ్య విభేదాలకు కారణాలు
ప్రస్తుతం మహ్మద్ యూనస్, వకార్ ఉజ్ జమాన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. 2009లో జరిగిన ఘర్షణల్లో 57 మంది ఆర్మీ అధికారులు, మరో 16 మంది హత్యకు గురైన ఘటనలో కోర్టు 300 మందిని దోషిగా తేల్చింది. అయితే ప్రస్తుతం యూనస్ సర్కార్ వారిని విడుదల చేయడం.. బంగ్లాదేశ్ సైన్యానికి నచ్చలేదని తెలుస్తోంది. దీంతోపాటు బంగ్లాదేశ్ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం కావడం కూడా వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం అయ్యాయి. మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు యూనస్ ప్రభుత్వం ఆమోదం తెలపడం ఆర్మీకి నచ్చలేదు. దాని వెనుక ఐక్యరాజ్యసమితి ఉన్నప్పటికీ మద్దతు మాత్రం అమెరికాదే అని తెలుస్తోంది.
అరకాన్ ఆర్మీ ఇటీవల సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకోగా.. బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని ఖండించింది. బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఈ ద్వీపం ఉండటంతో అమెరికా ఎప్పటి నుంచో దీనిపై దృష్టిపై ఉంది. ఇక్కడ ఆర్మీ బేస్ నిర్మిస్తే.. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుందని అమెరికా భావించింది. దీన్ని షేక్ హసీనా వ్యతిరేకించడంతో.. అదే కారణం అని.. గతంలో స్వయంగా ఆమెనే ఆరోపించారు. ఇప్పుడు యూనస్, జమాన్ మధ్య వివాదానికి కూడా ఇది ఒక కారణంగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa