టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విరాట్ కోహ్లీ సడెన్గా ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన అగార్కర్.. టెస్టు రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఏప్రిల్ నెలలోనే తనతో మాట్లాడాడని చెప్పారు. ఇదే సమయంలో రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై కూడా అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టెస్టు క్రికెట్లో కోహ్లీ, రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కాస్త కష్టమే అని అగార్కర్ అభిప్రాయపడ్డారు. అయితే ఇంగ్లండ్ పర్యటన నుంచి టీమిండియాలోని ఇతర ఆటగాళ్లు వారి పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. “రోహిత్ శర్మ, కోహ్లీల ప్లేసులో జట్టులోకి వచ్చే ఆటగాళ్లు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నా. ఆ ఇద్దరు సూపర్స్టార్ల స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్, మరో బ్యాటర్ కరుణ్ నాయర్ను ఎంపిక చేశాం” అని అగార్కర్ పేర్కొన్నారు.
కోహ్లీ రిటైర్మెంట్పై..
“టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ పలికే అంశంపై ఏప్రిల్ నెలలోనే విరాట్ కోహ్లీ తమను సంప్రదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఎంత ఆడాలో అంత ఆడినట్లు చెప్పాడు. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ పలకబోతున్నట్లు విరాట్ అన్నాడు” అని అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు ఎవరైనా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అనేది వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు.
ఇక రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్ ఎవరు? అనే అంశంపై చాలా కాలంగా సమాలోచనలు జరుపుతున్నట్లు భారత చీఫ్ సెలక్టర్ వెల్లడించారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే శుభ్మన్ గిల్ను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇంగ్లాండ్ టూర్తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 - 2027 సైకిల్కు మళ్లీ జట్టు నిర్మించే పనిలో తాము ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మే 7వ తేదీన రోహిత్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇది జరిగిన ఐదు రోజులకే అంటే మే 12న కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్బై చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa