బిహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. వ్యక్తిగత జీవితంలో ‘నైతిక విలువలు’ విస్మరించడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లాలూ స్పష్టం చేశారు.
ఈ వివాదం ఎలా మొదలైంది?
లాలూ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ శనివారం రాత్రి తన ఫేస్బుక్ ఖాతాలో ఒక మహిళతో దిగిన ఫోటోను పోస్టు చేశారు. ‘ఈ ఫోటోలో మీరు చూస్తున్నది అనుష్క యాదవ్. గత 12 ఏళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఒకరితో ఒకరు సంబంధంలో ఉన్నాం’ అని తేజ్ ప్రతాప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో బిహార్ రాజకీయాల్లో, ముఖ్యంగా లాలూ కుటుంబంలో ప్రకంపనలు మొదలయ్యాయి.
అయితే, కొద్దిసేపటికే తేజ్ ప్రతాప్ తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని.. తనను, తన కుటుంబాన్ని ‘అపఖ్యాతి పాలు చేయడానికి, వేధించడానికి’ ఈ పోస్టును సృష్టించారని ఆరోపించారు. ‘నా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు హ్యాక్ అయ్యాయి, నా ఫోటోలు తప్పుగా ఎడిట్ అయ్యాయి" అని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు.
లాలూ కఠిన నిర్ణయం..
తేజ్ ప్రతాప్ వివరణ ఇచ్చినప్పటికీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్రమైన ప్రకటన చేశారు. కొడుకును పార్టీ నుంచి మాత్రమే కాకుండా కుటుంబం నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు తిలోదకాలు ఇవ్వడం సామాజిక న్యాయం కోసం మనం చేస్తున్న సామూహిక పోరాటాన్ని బలహీనం చేస్తుంది. నా పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రవర్తన, బాధ్యతారాహిత్యం మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల తక్షణమే అతణ్ని పార్టీ నుంచి, కుటుంబం నుంచి తొలగిస్తున్నాను. ఇకపై అతనికి పార్టీలో లేదా కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదు. అతణ్ని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను’’ అని లాలూ తన పోస్టులో పేర్కొన్నారు.
తన కుమారుడి నిర్ణయాలను, అతనితో సంబంధం పెట్టుకునే వారి నిర్ణయాలను వారి ఇష్టానికే వదిలేస్తున్నానని లాలూ తెలిపారు. ప్రజా జీవింలో తాను జవాబుదారీతనానికి మద్దతునిస్తానని.. తన కుటుంబ సభ్యులు దీన్ని పాటిస్తున్నారని లాలూ చెప్పారు.
తేజస్వీ యాదవ్ ఏమన్నారు?
తేజ్ ప్రతాప్ తమ్ముడు, లాలూ వారసుడిగా భావిస్తున్న తేజస్వీ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘ మేం ఇలాంటి వాటిని సహించలేం, మేము బీహార్ ప్రజల కోసం అకింతభావంతో పని చేస్తున్నాం. మా పార్టీ చీఫ్ స్పష్టమైన ప్రకటన చేశారు. నా పెద్దన్నయ్య విషయానికి వస్తే.. రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరు. అతడికి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అన్నయ్య చేసిన పని నాకు మీడియా ద్వారానే తెలిసింది’ అని తేజస్వీ అన్నారు.
తేజ్ ప్రతాప్ విడాకుల వ్యవహారం:
తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ను వివాహం చేసుకున్నారు. 2018లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ వివాహం కొన్ని నెలలకే.. తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి విడాకుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్, అనుష్క యాదవ్తో ప్రేమలో ఉన్నట్లు చేసిన తాజా పోస్ట్ కలకలం సృష్టించింది.
తేజ్ ప్రతాప్ తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. తేజ్ ప్రతాప్ వ్యవహారం ఆర్జేడీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa