ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీదిరి అప్పలరాజు వర్సెస్ సీఐ.. ,, వీడియో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:34 PM

నిన్న విడదల రజిని.. నేడు సీదిరి అప్పలరాజు.. మాజీ మంత్రులు వర్సెస్ పోలీసులుగా ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్తా సీఐ నోటి నుంచి బూతులు వచ్చే స్థాయికి వెళ్లింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. వైసీపీ వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన ధన్‌రాజ్ అనే వ్యక్తి పశువుల షెడ్ నిర్మించుకున్నారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తిగత కక్షలతో దానిని కూల్చే ప్రయత్నం చేశారని.. అడ్డుపడితే తమపై దాడి చేశారంటూ ధన్‌రాజ్, అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే అంతకుముందే నిందితులు వీరిపై ఫిర్యాదు చేసి ఉండటంతో ధన్‌రాజ్‌ను పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారించారు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ధన్‌రాజ్ కుటుంబం తరుఫున పోలీసులను నిలదీశారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించాలని, కేసు నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగటంతో ఒకరినొకరు వేలు చూపించుకుని మాట్లాడేస్థాయికి వాగ్వాదం చేరింది. ఈ క్రమంలోనే సీఐ తిరుపతిరావు సహనం కోల్పోయి.. బూతులు మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బాధ్యత గలిగిన ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే.. బూతులు మాట్లాడుతారా అంటూ వైసీపీ శ్రేణులు సీఐ తీరుపై మండిపడుతున్నాయి.


అయితే ఈ వివాదంపై టీడీపీ వాదన కూడా ఉంది. గరుడభద్ర గ్రామంలోని వైసీపీ శ్రేణులు గ్రామకంఠం భూములను ఆక్రమించుకున్నారని.. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు గ్రామస్థులపై దాడికి దిగారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుపై పోలీసులు వైసీపీ శ్రేణులపై కేసు నమోదుచేశారని.. ఇది తెలిసీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడకు చేరుకుని హంగామా చేశారని తప్పుబడుతున్నాయి. వైసీపీ శ్రేణుల తరుపున వకాల్తా తీసుకుని పోలీసులను బెదిరించే ధోరణిలో సీదిరి అప్పలరాజు ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa