ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది కావస్తోంది. జూన్ 12వ తేదీ వస్తే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు పార్టీ శ్రేణులను ఆదేశించగా.. తాజాగా వైసీపీ పోస్టర్ కూడా విడుదల చేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గతేడాది జూన్ 4వ తేదీన వెల్లడయ్యాయి. ఈ ఫలితాలలో 164 సీట్లలో విజయం సాధించి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.
అయితే అధికారంలోకి వచ్చేందుకు.. ఎన్నికల సమయంలో అలవి కాని హామీలను చంద్రబాబు ఇచ్చారని.. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయని నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ నాలుగో తేదీని వెన్నుపోటు దినంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను వైసీపీ శుక్రవారం విడుదల చేసింది.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏడాది పూర్తి కావొస్తున్నా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మోసపూరిత హామీలు, వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని.. ఈ ఏడాదిలో ఒక్కరోజు కూడా సీఎం చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జూన్ నాలుగో తేదీ నిర్వహించే వెన్నపోటు దినం నిరసనలతో చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మరోవైపు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడేమో పీ- 4 విధానం అంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారని సజ్జల ఆరోపించారు. తొలి ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.1.49 లక్షల కోట్లు అప్పు చేసిందని సజ్జల ఆరోపించారు. అప్పులు చేసి తెచ్చిన సొమ్మును ఎందుకోసం వాడారో కూడా తెలియదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాలను అమలు చేసి..ఈ ఏడాది కాలం లబ్ధిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులతో పాటుగా.. సామాన్య ప్రజలు కూడా పెద్దఎత్తున పాల్గొని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa