దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరయా.. అని చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యం ఏదో ఒక అంశం మీద ఏపీ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. ఆలాగే ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం వివాదమవుతూనే ఉంటాయి. ఆ అంశం మీద రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇలా ప్రతిరోజూ సగటు ఆంధ్రప్రదేశ్ వాసిని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటాయి ఏపీ పాలిటిక్స్. అలాంటిదే ఇప్పుడు మరొక అంశం తెరపైకి వచ్చింది. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునివ్వగా.. వైసీపీ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక దీనికి పోటీగా జనసేన రంగంలోకి వచ్చింది.
జూన్ 4వ తేదీన సంక్రాంతి, దీపావళి కలిపి సెలబ్రేట్ చేసుకుందామంటున్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జనసేన నేతలు, కార్యకర్తలతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ నాలుగున సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామని కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.
అయితే వైసీపీ, జనసేన పోటాపోటీ కార్యక్రమాలు జూన్ నాలుగో తేదీన నిర్వహించడానికి కారణం ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే అలవికాని హామీలు ఇచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది.
సూపర్ సిక్స్ హామీల పేరిట టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చిందని.. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పథకాలను అమలు చేయడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారంటూ.. జూన్ 4న వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా సంబరాలు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో సంబరాలు చేసుకోవాలని జనసేన పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ రోజు మహిళలు ముగ్గులు వేసి కూటమి విజయాన్ని సెలబ్రేట్ చేయాలన్నారు. అలాగే పీడ విరగడై ఏడాది పేరుతో దీపాలు వెలిగించి.. బాణాసంచా కాల్చాలని.. సూచించారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలంటూ నాదెండ్ల మనోహర్ సూచించారు. మొత్తానికి వైసీపీ, జనసేన పోటాపోటీ కార్యక్రమాలతో జూన్ నాలుగో తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa