అనంతపురం ప్రజల నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్ల నెరవేరింది. అనంతపురం - బెంగళూరు ప్యాసింజర్ రైలు బుధవారం (జూన్ 4) ప్రారంభమైంది. అనంతపురం నుంచి మొదలయ్యే మొదటి రైలు ఇదే కావటం విశేషం. అనంతపురం - బెంగళూరు ప్యాసింజర్ రైలును బుధవారం రోజున అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తైందని.. ఇలాంటి మంచిరోజు, ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. అనంతపురం వాసులు ఇక నుంచి 50 రూపాయలతోనే బెంగళూరుకు వెళ్లవచ్చని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిటాల సునీత అభిప్రాయపడ్డారు,
మరోవైపు అనంతపురం రైల్వేస్టేషన్లో.. అనంతపురం బెంగళూరు రైలును ప్రారంభించిన తర్వాత.. టీడీపీ శ్రేణులతో కలిసి పరిటాల సునీత.. ప్రసన్నాయపల్లి వరకు రైళ్లోనే ప్రయాణించారు. ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్లో దిగిన అనంతరం.. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరిటాల సునీత.. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ఎక్కువగా బస్సులపైనా ఆధారపడేవారని, ఛార్జీల భారం ఎక్కువగా ఉండేదన్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. అందులో సీట్లు దొరకని పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, పార్థసారథి .. పుట్టపర్తి బెంగళూరు మధ్యన నడిచే ఈ రైలును అనంతపురం నుంచి నడపాలని కేంద్రాన్ని కోరినట్లు పరిటాల సునీత వివరించారు. ఎంపీల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అనంతపురం నుంచి నడిపేందుకు నిర్ణయం తీసుకుందని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మరోవైపు అనంతపురం బెంగళూరు రైలును మధ్యాహ్నం నుంచి కాకుండా ఉదయం ప్రారంభిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. అలాగే సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురం బయల్దేరేలా మార్పులు చేయాలని రైల్వే శాఖను కోరుతున్నారు. వీటితో పాటు విజయవాడ వైపు వెళ్లే రైళ్లు తక్కువగా ఉన్నాయని.. వీలైతే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. కుదరని పక్షంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకే అదనపు బోగీలు ఏర్పాటు చేయించాలని అనంతపురం వాసులు కోరుతున్నారు.
మరోవైపు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ ఉదయం 8 గంటల 35 నిమిషాలకు 66559 నంబరుతో ఈ రైలు బయల్దేరుతుంది. పుట్టపర్తి (సత్యసాయి ప్రశాంతి నిలయం) మధ్యాహ్నం 12.23 గంటలకు, ధర్మవరం రైల్వేస్టేషన్కు 1.05 గంటలకు, అనంతపురం మధ్యాహ్నం 1.55 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 66560 నంబరుతో అనంతపురం నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరుతుంది. ధర్మవరం 3.00 గంటలకు, సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) 3.50 గంటలకు చేరుకుంటుంది. రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa