కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద, డీసీపీ (సెంట్రల్ డివిజన్) హెచ్.టి. శేఖర్తో సహా ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. విచారణను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.విధానసౌధలో గురువారం నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. "కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (గిరీష్ ఎ.కె.), ఆ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) (బాలకృష్ణ), సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) (హెచ్.టి. శేఖర్), స్టేడియం భద్రతకు బాధ్యత వహించిన అదనపు పోలీస్ కమిషనర్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ (బి. దయానంద)లను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించాం" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.ఈ విషాద ఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, మంత్రులు హెచ్.కె. పాటిల్, ఎం.సి. సుధాకర్, హెచ్.సి. మహదేవప్పలతో పాటు సీఐడీ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం వివరించారు. "ప్రాథమికంగా ఈ అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయి. అందుకే వారిని సస్పెండ్ చేయాలని నిర్ణయించాం" అని ఆయన స్పష్టం చేశారు.ఆర్సీబీ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో ఈ తొక్కిసలాట జరగడం బాధాకరమని, మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నామని సీఎం అన్నారు. ఈ అంశాన్ని గురువారం జరిగిన సాధారణ కేబినెట్ సమావేశంలో తీవ్రంగా చర్చించామని, నిన్నటి దురదృష్టకర ఘటనపై చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని సిద్ధరామయ్య తెలిపారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం చెప్పారు. వారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. "నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఘటన జరగలేదు. ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది" అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa