అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమాన ప్రమాదం అంతులేని విషాదం మిగిల్చింది. ఆ విమానంలోని ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 242 మంది మృతిచెందారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడియన్ ఉన్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, డీఎన్ఏ టెస్ట్ల అనంతరం మృతదేహాలను గుర్తించినున్నట్టు గుజరాత్ ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ధనుంజయ ద్వివేది తెలిపారు. డీఎన్ఏ పరీక్షల కోసం ప్రయాణికుల బంధువులు శాంపిల్స్ ఇవ్వాలని ఆయన కోరారు. డీఎన్ఏ పరీక్షల్లో గుర్తించిన తర్వాతే బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు.
ఇక, విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోని ఐదుగురు మెడికోలు దుర్మరణం చెందారు. టెకాఫ్ అయిన తర్వాత విమానం 825 అడుగులు ఎత్తులో నుంచి కూలిపోయిన విమానం.. తొలుత జూనియర్ డాక్టర్లు హాస్టల్, తర్వాత సీనియర్ రెసిడెంట్ల హస్టల్పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ విద్యార్థులు మెస్లో లంచ్ చేస్తుండటంతో వారు గాయపడ్డారు. ఈ విమానం ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. అయితే, విమానాన్ని పక్షి ఢీకొట్టడం వల్ల కూడా ఇలా జరిగుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లండన్ వెళ్తున్న ఈ విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాద స్థలం వద్ద దృశ్యా, హాస్టల్ డైనింగ్ హాల్ గోడను విమానం ఢీకొట్టి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, విద్యార్థుల ప్లేట్లలో ఆహారం కనిపిస్తోంది.
విమానం తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉన్నప్పుడు భూమిని ఢీకొనడం, తర్వాత భారీ శబ్దంతో పేలిపోవడం ఒక వీడియోలో ఉంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) పలుమార్లు సంప్రదించినప్పటికీ ఏలాంటి ప్రతిస్పందన రాలేదని నివేదికలు చెబుతున్నాయి.
విమానాన్ని పైలట్ సమీర్ సబర్వాల్ నడుపుతుండగా.. ఆయనకు 8,200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందార్కు 1,100 గంటల అనుభవం ఉంది. DGCA ప్రకటన ప్రకారం, కూలిపోయే ముందు వారు మేడే కాల్ చేశారు. విమానానికి సంబంధించిన మిగతా భాగాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల కమ్ముకుంది. ఎమర్జెన్సీ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ప్రమాద స్థలానికి కనీసం 24 అంబులెన్సులు రాగా.. క్షతగ్రాతులను తరలించడానికి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశారు. ప్రమాదంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. అన్ని విమానయాన, అత్యవసర స్పందనా సంస్థలు వేగంగా, సమన్వితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎయిర్ ఇండియా బాధితుల కోసం ప్రత్యేకంగా హాట్లైన్ నెంబర్ 1800 5691 444 ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa