కిరాణా షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తికి అనుకోని కష్టం వచ్చింది. రాత్రివేళ గన్తో బెదిరించి.. అతడి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ లాక్కెళ్లారు దుండగులు. ఈ సంఘటన కొంపల్లిలో వెలుగు చూసింది. దీంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మెయిన్ రోడ్డు మీద ఉన్న కిరాణా షాపులోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు..
హైదరాబాద్కు చెందిన మోటూరి సాయిబాబా.. కొంపల్లిలో మెయిన్ రోడ్డు పక్కనే లక్ష్మి కిరాణా జనరల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి షాపు మూసే సమయంలో దొంగతనం చోటు చేసుకుంది. రోజంతా అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం రూ.5లక్షలు, తన మొబైల్ తీసుకుని షాపు మూసివేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఇద్దరు దుండగలు స్కూటీ మీద వచ్చి.. షాపు దగ్గర ఆగారు. ఇద్దరు ముఖాలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు.
వారిలో ఓ వ్యక్తి స్కూటీ మీద నుంచి కిందకు దిగి సాయిబాబా దగ్గరకు వెళ్లి గన్ చూపించాడు. చేతిలో ఉన్న నగదు బ్యాగ్ను తమకివ్వాల్సిందిగా బెదిరించి.. దాన్ని లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే సాయిబాబా దగ్గర పని చేస్తున్న పర్వేజ్ అనే వ్యక్తి.. దుండగుడిని ఆపేందుకు తీవ్రంగా కృషి చేశాడు. కానీ అతడు వారి చేతి నుంచి తప్పించుకున్నాడు.
ఇంతలో మరోక వ్యక్తి స్కూటీ వేసుకుని రావడంతో.. నగదు బ్యాగ్ లాక్కున్న వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని స్కూటీ ఎక్కాడు. ఆ తర్వాత దుండుగులు ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ షాపులో చోరీ జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇదే దుకాణంలో రూ.10 లక్షల విలువ చేసే సిగరెట్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి.
గతంలో దొంగతనం జరిగిన సమయంలోరాత్రి షాపు ముందు ఇక డీసీఎం వాహనాన్ని పార్క్ చేసి.. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా షాపులోని వస్తువులను దానిలోకి ఎక్కించి.. మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు దుండగులు. ఇప్పుడు మరో సారి ఇదే షాపులో దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే ప్రాంతంలో వరుస దొంగతనాలు, సెల్ ఫోన్లు, పార్కింగ్ చేసిన బైక్లను కూడా గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజుల నుంచి వరుసగా దొంగతనాలు, హత్య, ఇతరచిన్న చిన్న నేరాలు వెలుగు చూడటం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa