ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. కేంద్రం ప్రత్యేక దృష్టి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:52 PM

అమృత్ భారత్ స్టేషన్ పథకంతో ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని 73 రైల్వేస్టేషన్లను రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది. అమృత్‌ భారత్ స్టేషన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందట అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులు ముగింపు దశకు చేరుకోగా.. ధర్మవరం రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. విశాలమైన రోడ్లతో పాటుగా ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చేశారు. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు ఏర్పాటు చేయటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ధర్మవరం రైల్వే స్టేషన్ శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్. గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది. ధర్మవరం రైల్వే స్టేషన్ ముఖ్యమైన జంక్షన్. ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, గుంతకల్‌లను కలిపే మూడు ప్రధాన రూట్లు కలుస్తాయి. ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మెయిల్ ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, గరీబ్ రథ్, వందే భారత్, మెము, డెము, ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఈ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల కోసం జనరల్ వెయిటింగ్ రూములు, వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.


మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రారంభించింది. దీని లక్ష్యం దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం. రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో 40 స్టేషన్లు. ఏపీలో 73 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 2025 మే 22న 103 స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.


తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట వంటి స్టేషన్లను ఈ పథకం కింద ఇప్పటికే అభివృద్ధి చేశారు. ఆధునిక సౌకర్యాలైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ఉచిత వై-ఫై, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa