అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు చనిపోగా.. ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిని పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి)గా గుర్తించారు. బైడూ భైసాల్ (ఒడిశా) అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పరవాడ ఫార్మాసిటీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కంపెనీలో ఉన్న రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర లెవల్స్ చెక్ చేయడానికి ముగ్గురు ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం రాగానే పరవాడ సీఐ, పోలీస్ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లారు. చనిపోయిన ఇద్దరు మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ అవ్వడంతో ప్రజలు భయపడుతున్నారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం దగ్గర బెల్లంకొండవారి మెరకలో ఈ ఘటన జరిగింది. కొత్తగా వేసిన పైపులైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ గురించి ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు సిబ్బందిని అక్కడికి పంపిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఓఎన్జీసీ పైపులైన్ లీక్ అయింది.. వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్ లీకైన చోట రిపేర్లు చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa