ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం డబ్బులు రూ.13 వేలు జమ.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 05:13 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బుల్ని తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తోంది. గురువారం బ్యాంకులకు డబ్బులు చేరగా.. అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,459 మంది తల్లులు, సంరక్షకులకు ఈ డబ్బుల్ని చెల్లిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున విడుదల చేయగా.. అందులో రూ.2వేలను మినహాయించి రూ.13వేలు తల్లికి వందనం పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. మిగిలిన రూ.2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తోంది ప్రభుత్వం.


మరోవైపు తల్లికి వందనం పథకం డబ్బులు జమ అయ్యాయా?.. లేదా? స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచింది.. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పథకం అనే ఆప్షన్ దగ్గర తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి. 2025-26 సంవత్సరాన్ని సెలక్ట్ చేసి.. ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


వాట్సాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 నంబర్‌కు Hi మెసేజ్ చేయగానే అక్కడ సేవలన్నీ వస్తాయి.. వాటిలో ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.


ఒకవేళ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలియకపోతే.. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాలను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ జాబితాలో చెక్ చేసుకోవచ్చు.. ఒకవేళ ఈ జాబితాపై అభ్యంతరాలున్నా, అర్హత ఉండి డబ్బులు జమ కాకపోయనా, ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు. అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్‌హోల్డ్‌ డేటా లేదు.. ఈ మేరకు అందులో తప్పుల్ని సరిచేసి డబ్బుల్ని జమ చేస్తారు. తల్లికి వందన పథకానికి సంబంధించి ఫిర్యాదుల్ని జూన్‌ 12 నుంచి 20 వరకు స్వీకరిస్తారు. గ్రీవెన్స్‌ పరిశీలన, అదనపు జాబితాను జూన్‌ 21-28 మధ్య రెడీ చేస్తారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్‌ 30న ప్రదర్శిస్తారు. వీరందరికి జులై 5న డబ్బుల్ని జమ చేస్తారు. తల్లికి వందనం జాబితాలో పేరు లేకపోయినా, డబ్బులు జమ కాకపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


'నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, తల్లికి వందనం పథకం కింద చంద్రన్న పంపించాడు రూ.60 వేలు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా రూ.60 వేలు వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ, వారి ఖాతాల్లో ఒకే రోజు రూ.10 వేల కోట్లు వేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలని గౌరవిస్తుంది కూటమి ప్రభుత్వం' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.


'కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు... రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లో, "తల్లికి వందనం" కింద ఒకే రోజు రూ.10 వేల కోట్లు జమ. ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఖాతాలో, రూ.39 వేలు పడ్డాయి. స్కూల్ ఖాతాలో మరో రూ.6 వేలు. ఇది మహిళల ప్రభుత్వం. మహిళలని గౌరవించే ప్రభుత్వం' అంటూ మరో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa