ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రమాదంలో నర్సు మృతి, డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్.. వీరిద్దరికీ సంబంధమేంటంటే?

national |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 08:09 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా చనిపోయారు. అయితే అందులోనే కేరళకు చెందిన ఓ నర్సు కూడా ఉన్నారు. ఆమె రేపే రంజితా నాయర్. అయితే ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఆమె గురువారం రోజు చనిపోగా.. ఓ డిప్యూటీ తహసీల్దార్ అనుచిత పోస్టు పెట్టారు. ముఖ్యంగా ఈమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు తగిన శాస్తే జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ విషయం గుర్తించిన పైఅధికారులు అతడిని వెంటనే పదవీలోంచి సస్పెండ్ చేశారు.


కేరళకు చెందిన 42 ఏళ్ల రంజితా గోపకుమరన్ నాయర్.. ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. అయితే ఈమెకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అలాగే తండ్రి చనిపోవడంతో, ఈమె తల్లి ఒంటరిగా మారింది. అప్పటి నుంచి ఆమెను కూడా రంజితా నాయరే చూసుకుంటున్నారు. తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు. అయితే వీరికి ఇప్పటి వరకు సొంత ఇళ్లు లేదు. దీంతో తన తల్లి, పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆమె ఎలాగైనా సరే సొంత ఇళ్లు నిర్మించాలనుకున్నారు. అందుకోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధమయ్యారు. తాను చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఆ జీతం చాలకపోవడంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలని భావించారు.


అదే విషయం తనకు తెలిసిన వాళ్లకు కూడా చెప్పగా.. బ్రిటన్‌లో ఆమెకు ఉద్యోగం దొరికింది. దీంతో తాను చేసే సర్కారు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి.. తల్లి వద్దే పిల్లలను ఉంచి.. వారందరి బాధ్యతను భర్తకు అప్పగించి బ్రిటన్ వెళ్లిపోయారు. నెలనెలా తనకు వచ్చే జీతాన్ని పంపిస్తూ.. సొంత ఇంట కళను సాకారం చేసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇంటి పనుల నిమిత్తం ఆమె స్వరాష్ట్రానికి తిరిగి రావాల్సి వచ్చింది. అందుకోసం ఆమె కేవలం 5 రోజులే సెలవు పెట్టుకుని ఇంటికి చేరారు. ఇక సెలవులు ముగియడంతో గురువారం రోజు అహ్మదాబాద్ విమానంలో ఎక్కి బ్రిటన్‌కు ప్రయాణమయ్యారు. కానీ ఆ విమానం ప్రమాదానికి గురై అక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమె మృతిని ధ్రువీకరించింది.


ఈ విషయం తెలుసుకున్న వెల్లరికుండు డిప్యూటీ తహసీల్దార్ ఏ పవిత్రన్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా రంజిత మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయర్ మహిళ ఉందని చెప్పారు. ఆమె తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిందని.. కేరళ ప్రభుత్వం ఆమెకు సర్కారు ఉద్యోగం ఇస్తే.. సెలవు పెట్టి మరీ ఆమె విదేశాలకు వెళ్లిందని గుర్తు చేశారు. అయితే తాజాగా ఆమెకు దక్కాల్సిందే దక్కిందంటూ మరణం గురించి మాట్లాడారు. ఈ పోస్టు క్షణాల్లోనే నెట్టిటం వైరల్ కాగా.. ఏ పవిత్రన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చనిపోయిన ఓ మహిళ గురించి, ఆమె కులం గురించి ఇలా మాట్లాడడం సరికాదని నెటిజెన్లు కామంట్లు చేశారు.


ముఖ్యంగా ఈ పోస్టును రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ వరకూ వెళ్లగా.. ఆయన కూడా డిప్యూటీ తహసీల్దార్‌ర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని చెబుతూనే.. అతడిని పదవిలోంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాసర్‌గడ్ కలెక్టర్ శుక్రవారం రోజు అతడిని సస్పెండ్ చేశారు. ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ కన్‌హంగద్ ఎమ్మెల్యే ఈ చంద్రశేఖర్ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు గుర్తు చేశారు. ఆ విషయంలోనూ కేసు నమోదు అయిందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa