నెల్లూరు జిల్లాలో కారులో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిస పోలీసులు వారి నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి.. రూ.4.5 కోట్ల నగదును గుమాస్తా, డ్రైవర్ చేతికి ఇచ్చి పంపించారు. అయితే మార్గమధ్యలో వారు నగదు తీసుకుని పరారయ్యారు. వ్యాపారవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మర్రిపాడు పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. నిందితుల నుంచి రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అది నెల్లూరు జిల్లాలోని సింగనపల్లి అటవీ ప్రాంతం.. 565 నంబర్ జాతీయ రహదారి.. ఆ జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా ఓ కారు.. కానీ కారులో మనుషులు ఎవరూ లేరు. అయితే కారు అక్కడే ఆగి ఉంది.. గంటలు గడిచిపోతున్నాయి, కానీ కారు కోసం ఎవరూ రావటం లేదు. అటవీ ప్రాంతంలో, నేషనల్ హైవే మీద అలా కారు ఆగి ఉండటంతో కొంతమంది వాహనదారులకు అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం అందించారు.. ఇక్కడ అడవిలో కారు ఆగి ఉందని.. మనుషులు ఎవరూ కనిపించడం లేదంటూ పోలీసులకు తెలిపారు. దీంతో మర్రిపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్నారు. కారును పరిశీలించారు. ఈ వాహనాన్ని ఇక్కడ ఎవరు ఆపారు, ఎందుకు ఆపారనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.
కారు యజమాని ఎవరో తెలిసింది.. కానీ..
కారు నంబర్ ఆధారంగా మర్రిపాడు పోలీసులు.. యజమానిని గుర్తించారు. అతనికి ఫోన్ చేశారు. అయితే పోలీసులు చెప్పింది విని.. అతను షాక్ తిన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. తనది అహ్మదాబాద్ అని.. తానో వ్యాపారవేత్తగా కారు యజమాని పోలీసులకు చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఢిల్లీ నుంచి చెన్నైకు తన గుమాస్తా, డ్రైవర్తో డబ్బులు పంపించినట్లు చెప్పారు. కారులో ఢిల్లీ నుంచి చెన్నైకు నాలుగున్నర కోట్లు పంపించానని కారు యజమాని మర్రిపాడు పోలీసులకు తెలిపారు. కారుకు జీపీఎస్ ట్రాకర్ కూడా ఏర్పాటు చేశానని.. అయితే నెల్లూరు జిల్లా సరిహద్దు వద్ద జీపీఆర్ఎస్ కట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తోందని.. ఏమయ్యారో తెలియడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు .
కారు యజమాని ఫిర్యాదు ఆధారంగా మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను మర్రిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నిజం అంగీకరించారు. మార్గమధ్యలోనే కారు ఆపివేసి.. నగదు తీసుకుని పరారైనట్లు నిందితులు అంగీకరించారు. అలాగే నిందితుల నుంచి రూ.3.60 కోట్ల నగదును మర్రిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa