ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టనున్న 'యోగాంధ్ర' కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 607 సచివాలయాల సిబ్బంది హాజరవుతున్నారని, వారిని సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 గంటల నుంచి 8:00 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఆర్కే బీచ్లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa