దేశంలో పదిహేనేళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశచరిత్రలో మొదటిసారి జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టనున్నారు. వచ్చే 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభించి, రెండు దశల్లో పూర్తిచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా వివరాలను సేకరిస్తారు. 2027 మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జనగణన జరుగుతుందని పేర్కొంది.
జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హోం సెక్రటరీ, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO)్ అంటే ప్రతి కుటుంబ నివాస స్థితి, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు.
పాపులేషన్ ఎన్యూమరేషన్ (PE): ప్రతి వ్యక్తి జాతి, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలు నమోదు చేస్తారు. ఈ దశలోనే వ్యక్తుల కులం (Caste) గురించి సమాచారం సేకరిస్తారు.
కుల గణనపై స్పష్టత:
దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రకటించింది. బీహార్లో ఈ ఏడాది చివర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బీహార్ జనాభాలో 63% పైగా ప్రజలు వెనుకబడిన తరగతులకు చెందినవారే. కులం (Caste) వివరాలను మాత్రమే సేకరిస్తామని, వర్గం (Class) కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి వ్యక్తి తన కులం, మతం వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఇతర వెనుకడిన తరగతులకు (ఓబీసీ) సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే జాబితా లేదు. రాష్ట్రాల OBC జాబితాలు భిన్నంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కోసం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ద్వారా ఒక జాబితా నిర్వహిస్తోంది. కానీ రాష్ట్రాల జాబితాలు విస్తృతంగా ఉంటాయి. కులగణనపై కేంద్రం ప్రకటన చేయడంతో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
దేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. చివరిసారిగా 2011లో జరిగింది. కానీ, 2021 జనగణన కోవిడ్-19 వ్యాప్తితో రద్దయ్యింది. కాబట్టి 2027 జనగణన, 16 ఏళ్ల విరామం తర్వాత మొదలయ్యే తొలి గణన. ఇదే మొదటి ‘డిజిటల్ జనగణన’ అవుతుంది. ఎందుకంటే ప్రజలే స్వయంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ జనగణనను త్వరగా ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతూ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa