ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిరోడ్డుపై మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 07:40 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో బైక్ డ్రైవర్ కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. నగరంలోని జయనగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న వివాదంగా మొదలైన ఆ ఘటన.. చిలికి చిలికి గాలి వానలా పెరిగి పెద్దదైంది. మొదట్లోనే వారిద్దరి గొడవను ఆపేందుకు అక్కడ ఉన్న వారు ఎంత ప్రయత్నించినా వారు వినిపించుకోకుండా వాదించుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించకపోవడం, హెల్మెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ర్యాపిడో బైక్ డ్రైవర్.. ఆ మహిళ చెంపపై కొట్టాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆమె బైక్‌ను మధ్యలోనే ఆపేసి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఫిర్యాదు చేయాలని చెప్పినా ఆమె అందుకు నిరాకరించడం గమనార్హం.


స్థానికంగా ఉండే ఒక జ్యువెలరీ షాప్‌లో పనిచేసే మహిళ.. ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించగా.. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై మధ్యలోనే దిగి డ్రైవర్‌ను నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారిద్దరికీ వాగ్వాదం తీవ్రం కాగా.. ఆమె ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగా.. డ్రైవర్ కన్నడ మాత్రమే మాట్లాడటంతో భాషా వివాదం కాస్తా ఆ గొడవకు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ డబ్బులు చెల్లించడానికి, హెల్మెట్‌ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటింది.


డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టడం.. ఆమె కిందపడిపోవడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు వారిద్దరూ వాదించుకుంటూ.. జోక్యం చేసుకోవాలని చుట్టూ ఉన్న వారిని కోరినా అందుకు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక ఆ ర్యాపిడో డ్రైవర్.. మహిళను కొట్టిన తర్వాత కూడా అతన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం తీవ్ర దుమారనికి కారణం అయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు మహిళను కోరినప్పటికీ.. ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపారు. దీంతో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు.. కర్ణాటకలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కూడా సమర్థించింది. బైక్‌లను వాణిజ్య వాహనాలుగా నడపడానికి వీలు లేదని కర్ణాటక ప్రభుత్వం వాదించింది. బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధమని.. హైకోర్టు 3 నెలల క్రితమే తీర్పునిచ్చిందని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఆ తర్వాత 6 వారాల గడువు ఇచ్చారని.. తర్వాత మరో ఆరు వారాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు 12 వారాలు ముగిశాయని.. ర్యాపిడో, ఓలా, ఉబర్ మోటో సంస్థలు తప్పనిసరిగా హైకోర్టు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు.


అయితే హైకోర్టు.. బైక్ ట్యాక్సీలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా ర్యాపిడో మాత్రం ఇంకా పార్సిల్ సేవలు అందిస్తోందని.. తాజాగా ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. భారతదేశ టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు నగరంలో బైక్ ట్యాక్సీలకు భారీ గిరాకీ ఉంటుంది. మార్కెట్ వాటాలో రాపిడో ఒక్కటే 60 శాతం కలిగి ఉంది. నిత్యం 16.5 లక్షల రైడ్‌లను నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బైక్ ట్యాక్సీలు కనీసం 1.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ బైక్ ట్యాక్సీల నిషేధంతో వేలాది మంది డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa