ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ప్రధానికి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 07:36 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ దేశం అరుదైన గౌరవాన్ని అందించింది. సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III'తో మోదీని సత్కరించింది. ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య సంస్కృతి, సోదర భావం, వసుధైవ కుటుంబకం భావనకు ప్రతీక అని చెప్పారు.


'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III' అనేది సైప్రస్ దేశం అందించే అత్యున్నత పౌర పురస్కారం. దేశం కోసం, అంతర్జాతీయ సంబంధాల బలోపేతానికి, ప్రపంచ శాంతి స్థాపనకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా.. ఆ దేశం ఈ పురస్కారాన్ని అందజేస్తుంటుంది. ప్రధాని మోదీకి ఈ గౌరవం లభించడం భారత దేశానికి అంతర్జాతీయ వేదికలపై లభించిన అరుదైన గుర్తింపుగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీయే దీని గురించి మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య స్నేహ బంధానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ గుర్తింపు ఇరు దేశాల మధ్య శాంతి భద్రతలు, సార్వభౌమాధికారాలపై నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.


 అలాగే భారత్-సైప్రస్ దేశాల మధ్య ఉన్న క్రియాశీల భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి దోహద పడతాయన్నారు.


భారత ప్రధాని సైప్రస్‌ను సందర్శించడం ముచ్చటగా మూడో సారి కాగా.. చివరగా 2002లో వెళ్లారు. సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు, స్నేహానికి మరింత బలం చేకూర్చనుంది. ముఖ్యంగా ఈ పర్యటనలో సైప్రస్, టర్కీ మధ్య ఉన్న సంబంధాలు, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.


చాలా కాలంగా టర్కీకి, సైప్రస్‌కు మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ సమయంలోనే మోదీ సైప్రస్ పర్యటనకు వెళ్లడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ టర్కీ, చైనా దేశాలకు చెందిన డ్రోన్లను ఉపయోగించింది. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది.ఈ పర్యటన అనంతరం మోదీ కెనడాలో జరగబోయే G7 సమ్మిట్‌లో పాల్గొంటారు. చివరగా క్రొయేషియాలో పర్యటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa