బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా కణేకల్ మండలంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు గురువారం ర్యాలీ నిర్వహించారు. కణేకల్ బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన వారు, తహసీల్దార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్డీటీ సంస్థ 56 ఏళ్లుగా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయాభివృద్ధి, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో అసాధారణ సేవలు అందిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది.
ఆర్డీటీ సంస్థ తన సేవా కార్యక్రమాల కోసం విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులపై ఆధారపడుతుంది. అయితే, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడంతో ఈ నిధులు ఆగిపోయాయి. దీంతో సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో, లబ్దిదారులు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సంస్థ కొనసాగితేనే తమ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, పేదలకు అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో ఆర్డీటీ సంస్థతో లబ్ధి పొందిన అనేక మంది మహిళలు, వికలాంగులు, రైతులు పాల్గొన్నారు. సంస్థ వల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులను వారు వివరించారు. ఆర్డీటీ సంస్థను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి, కేంద్ర హోంశాఖపై ఒత్తిడి తేవాలని అఖిలపక్ష నేతలు ఇప్పటికే తీర్మానించినట్లు తెలుస్తోంది. త్వరలో అనంతపురంలో సంఫీుభావ సదస్సు నిర్వహించి, ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాలని నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa