పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, తామే ముందుగా కాల్పుల విరమణ ఒప్పందానికి విజ్ఞప్తి చేశామని ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ ఈ విషయాలు వెల్లడించారు. ఇండియా తమ ముఖ్యమైన ఎయిర్బేస్లపై కచ్చితమైన దాడులు చేయడంతోనే తాము న్యూఢిల్లీని కాల్పుల విరమణ కోరామని చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో అమెరికా, సౌదీ అరేబియా దేశాల సహాయం కూడా తీసుకున్నామని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉదయం 4 గంటలకు తమ ప్రణాళికను అమలు చేసేలోపే.. ఇండియా ఒకే ఒక్క రాత్రిలో నూర్ ఖాన్, షోర్కోట్ ఎయిర్బేస్లపై దాడి చేసిందని ఆయన వివరించారు.
భారత్ మే 7, 8 తేదీల మధ్య రాత్రి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీని ద్వారా పాకిస్థాన్లోని ముఖ్యమైన స్థావరాలను, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కూడా దాడులు చేసింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది టూరిస్టులను చంపిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగింది. ఈ దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ పౌరులు ఉండే ప్రాంతాల్లో, సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అయితే భారత సైన్యం పాకిస్థాన్ డ్రోన్లను, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత 10కి పైగా ఎయిర్బేస్లపై దాడులు చేసింది.
ఇషాక్ దార్ ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. "భారతదేశం మళ్లీ తెల్లవారుజామున 2.30 గంటలకు క్షిపణి దాడులు చేసింది. వాళ్లు నూర్ ఖాన్ ఎయిర్ బేస్, షోర్కోట్ ఎయిర్ బేస్లపై దాడి చేశారు. 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ నాకు ఫోన్ చేశారు" అని చెప్పారు. "నేను ఇప్పుడే మార్కో రూబియోతో (అమెరికా విదేశాంగ కార్యదర్శి) మాట్లాడిన విషయం తెలుసుకున్నాను. ఇండియా ఆపితే, తాను (విదేశాంగ మంత్రి) ఎస్ జైశంకర్తో మాట్లాడటానికి అధికారం ఉందా అని అడిగారు. మీరు మాట్లాడొచ్చు అని నేను చెప్పాను. 25 నిమిషాల తర్వాత ఆయన నాకు మళ్లీ ఫోన్ చేసి, జైశంకర్కు విషయం చెప్పానని అన్నారు" అని దార్ వివరించారు.
మూడు రోజుల పాటు ఈ పోరాటం కొనసాగిందన్నారు. మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO), తన భారతీయ సహోద్యోగికి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోరారని చెప్పారు. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. ఇండియా ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది. ఉగ్రవాదులకు అండగా ఉంటే ఎలా ఉంటుందో చూపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa