ట్రెండింగ్
Epaper    English    தமிழ்

60కి పైగా యుద్ధ విమానాలతో క్షిపణి తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం

international |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 07:58 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. 60 యుద్ధ విమానాలతో ఇరాన్ లోని లక్ష్యాలపై నిప్పులు చెరిగింది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ  ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 639 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం.ఇరు దేశాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది. అయితే, తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ పునరుద్ఘాటిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, యూరోపియన్ దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఇరాన్‌ను శాంతియుత చర్చలకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంలో తమ దేశం జోక్యంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్  వెల్లడించిన వివరాల ప్రకారం, 60కి పైగా యుద్ధ విమానాలు, సుమారు 120 శక్తివంతమైన ఆయుధాలతో ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోని పలు క్షిపణి తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక పారిశ్రామిక ప్రాంతాలుగా ఐడీఎఫ్ అభివర్ణించింది. క్షిపణి విడిభాగాలు, రాకెట్ ఇంజన్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై దాడులు కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని ఎస్పీఎన్‌డీ ప్రధాన కార్యాలయ భవనాన్ని ఈ ఆపరేషన్‌లో విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది."క్షిపణి విడిభాగాల ఉత్పత్తికి సంబంధించిన సైనిక పారిశ్రామిక ప్రాంతాలు, రాకెట్ ఇంజన్ల తయారీకి వాడే ముడిపదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై దాడి చేశాం. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టును దెబ్బతీసే చర్యల్లో భాగంగా, టెహ్రాన్‌లోని ఎస్పీఎన్‌డీ ప్రధాన కార్యాలయ భవనంపై కూడా దాడి చేయడం జరిగింది" అని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఎస్పీఎన్‌డీ సంస్థ ఇరాన్ సైనిక సామర్థ్యానికి అవసరమైన అధునాతన సాంకేతికతలు, ఆయుధాల పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమ రూపశిల్పిగా పేరుగాంచిన ఫఖ్రి జాదే 2011లో ఈ సంస్థను స్థాపించారు. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింతగా ముసురుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa