ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి భారత వ్యోమగామి

international |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 07:59 PM

అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో  విజయవంతంగా అడుగుపెట్టారు. వారి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే  ప్రక్రియ గురువారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. ఈ ఘనతతో అంతరిక్ష యాత్రల్లో భారత్ తనదైన ముద్రను మరోసారి చాటింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్‌, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ, హంగరీకి చెందిన టిబర్‌ కపులు అంతరిక్షయానం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం బుధవారం జూన్ 25 మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా వీరి స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.దాదాపు ఒక రోజు ప్రయాణం అనంతరం, గురువారం జూన్ 26 సాయంత్రం ఈ వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:03 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానించే డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అనంతరం వ్యోమగాములు నలుగురూ ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా సహా వ్యోమగాముల బృందం 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది. ఈ సమయంలో వారు పలు పరిశోధనలు, ప్రయోగాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa