ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర వివాదాన్ని రేపాయి

international |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 05:10 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర వివాదాన్ని రేపాయి. ఇరాన్‌పై అమెరికా ఇటీవల జరిపిన సైనిక దాడులను, రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులతో పోల్చడంపై జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై అణుబాంబు దాడి బాధితులు, అధికారులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్‌పై జరిపిన దాడుల గురించి ప్రస్తావించారు. అమెరికా నిఘా వర్గాలు అంచనా వేసినట్లుగా ఇరాన్ అణు కార్యక్రమం కేవలం కొన్ని నెలలు మాత్రమే వెనక్కి వెళ్లలేదని, దశాబ్దాల పాటు కోలుకోలేనంతగా దెబ్బతీశామని ఆయన వాదించారు. ఈ క్రమంలో, "ఆ దాడితో యుద్ధం ముగిసింది. నేను హిరోషిమా, నాగసాకి ఉదాహరణలు వాడాలనుకోవడం లేదు, కానీ ఇరాన్ పై దాడి కూడా దాదాపు అలాంటిదే" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ చేసిన ఈ పోలికపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రపంచంలో అణుదాడికి గురైన ఏకైక దేశంగా జపాన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. 1945 ఆగస్టులో జరిగిన ఈ దాడుల్లో సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇప్పటికీ ఆనాటి గాయాల తాలూకు ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్నారు.ఈ వ్యాఖ్యలపై నాగసాకి నగర మేయర్ షిరో సుజుకి స్పందిస్తూ, "ట్రంప్ వ్యాఖ్యలు అణుబాంబు దాడిని సమర్థించేలా ఉన్నాయి. బాంబు దాడికి గురైన నగరం తరఫున ఇది మాకు చాలా విచారకరం" అని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అణుబాధితుల హక్కుల సంస్థ 'నిహాన్ హిడాంక్యో' సహ-అధ్యక్షుడు మిమాకి తోషియుకి కూడా ట్రంప్ మాటలను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సంస్థకు చెందిన మరో బాధితురాలు టెరుకో యోకోయామా మాట్లాడుతూ, నాకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతోంది అని వ్యాఖ్యానించారు.ట్రంప్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు హిరోషిమాలో బాధితులు, పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు, హిరోషిమా చట్టసభ సభ్యులు అణ్వాయుధాల వినియోగాన్ని సమర్థించే ఎలాంటి ప్రకటననైనా తిరస్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అన్ని సాయుధ ఘర్షణలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ విషయంపై జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఫిర్యాదు చేస్తుందా అని ప్రశ్నించగా, జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హయాషి యోషిమాస స్పందిస్తూ.. "అణుబాంబుల విషయంలో మా వైఖరిని వాషింగ్టన్‌కు పదేపదే స్పష్టం చేశాం" అని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-జపాన్ సంబంధాలలో ఉన్న సున్నితమైన చారిత్రక అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa