ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులన్న వైట్ హౌస్

international |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 08:23 AM

భారత్‌తో తమ మైత్రి చాలా ప్రత్యేకమైనదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక అత్యంత కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య బలమైన స్నేహబంధం ఉందని వైట్ హౌస్ పేర్కొంది. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, తుది మెరుగులు దిద్దుకుంటోందని వెల్లడించింది.సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండో-పసిఫిక్‌లో చైనా ప్రభావంపై ఏఎన్ఐ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. "ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ మాకు చాలా వ్యూహాత్మకమైన మిత్రదేశం. అధ్యక్షుడు ట్రంప్‌కు, ప్రధాని మోదీకి మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధం ముందుముందు కూడా ఇలాగే కొనసాగుతుంది" అని ఆమె తెలిపారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి అడిగిన మరో ప్రశ్నకు కూడా లెవిట్ సానుకూలంగా స్పందించారు. "గత వారం అధ్యక్షుడు చెప్పినట్టుగానే వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయంపై నేను ఇప్పుడే మా వాణిజ్య కార్యదర్శితో మాట్లాడాను. వారు ఒప్పందాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే దీనిపై అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది" అని ఆమె వివరించారు.ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన క్వాడ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలోనే సోమవారం ఐక్యరాజ్యసమితిలో 'ఉగ్రవాదం సృష్టించే మానవ విషాదం' అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కొన్ని దేశాల అండతోనే ఉగ్రవాదం ఎలా విస్తరిస్తోందో ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం.భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమే క్వాడ్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, స్థిరమైన వాతావరణాన్ని కాపాడటమే దీని లక్ష్యం. కాగా, ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీ పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. గత నెల కెనడాలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అప్పట్లో ధ్రువీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa