ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం ఉంటుందన్న డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 09:33 AM

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని, ఈ ఒప్పందం చాలా తక్కువ సుంకాలను కలిగి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మంగళవారం స్థానిక కాలమాన ప్రకారం ట్రంప్ మాట్లాడుతూ, "భారత్‌తో మేము ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని నేను భావిస్తున్నాను. ఇది భిన్నమైన ఒప్పందంగా ఉంటుంది. మేం భారత మార్కెట్లోకి వెళ్లి పోటీ పడటానికి వీలు కల్పించే డీల్ అది. ప్రస్తుతానికి భారత్ ఎవరినీ అనుమతించడం లేదు. కానీ, వారు అనుమతిస్తారని నేను నమ్ముతున్నాను. అలా చేస్తే, చాలా తక్కువ సుంకంతో మేము ఒప్పందం చేసుకుంటాం" అని స్పష్టం చేశారు.మరోవైపు వాషింగ్టన్‌లో జరుగుతున్న వాణిజ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. జూలై 9 గడువు సమీపిస్తుండటంతో వ్యవసాయ సంబంధిత అంశాలపై భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి. చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం చర్చల నిమిత్తం తమ పర్యటనను పొడిగించుకుంది. గత వారం గురు, శుక్రవారాల్లో జరగాల్సిన చర్చలు, ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో పొడిగించ‌డం జ‌రిగింది.ట్రంప్ హయాంలో విధించి, ప్రస్తుతం 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన 26 శాతం పరస్పర సుంకాలు తిరిగి అమల్లోకి రాకుండా ఉండేందుకు ఈ చర్చలు కీలకంగా మారాయి. ఒకవేళ జూలై 9 లోపు ఒప్పందం కుదరకపోతే ఈ సుంకాలు వాటంతట అవే మళ్లీ అమల్లోకి వస్తాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.భారత్‌లో వ్యవసాయ రంగం రాజకీయంగా అత్యంత సున్నితమైనది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. దేశంలో అధిక శాతం చిన్న, సన్నకారు రైతులు ఉండటంతో వ్యవసాయ రంగంలో రాయితీలు ఇవ్వడం ఆర్థికంగా, రాజకీయంగా సవాలుతో కూడుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ భారత్ తన పాల  రంగాన్ని విదేశీ పోటీకి తెరవలేదు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు భారత్ సిద్ధంగా లేదని తెలుస్తోంది.యాపిల్స్, నట్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు వంటి తమ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనికి బదులుగా వస్త్రాలు, రత్నాలు-ఆభరణాలు, తోలు వస్తువులతో పాటు రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి తమ వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో ప్రాధాన్యత కల్పించాలని భారత్ కోరుతోంది.ఈ తాత్కాలిక ఒప్పందంతో పాటు 2024 చివరి నాటికి ఒక సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  మొదటి దశను పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతమున్న 191 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa