ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం.. పోటెత్తిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 04:22 PM

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉచిత స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కావటంతో.. భక్తులు భారీగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తరలి వస్తున్నారు. బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆధార్‌ నమోదు లేకుండానే భక్తులకు కూపన్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీశైలంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని దేవస్థానం అధికారులు మంగళవారం నుంచి ప్రారంభించారు.


మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు మంగళవారం పున:ప్రారంభించారు. ఉచిత స్పర్శ దర్శనం టికెట్‌ను స్వయంగా భక్తులకు అందజేశారు. మరోవైపు శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం.. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. ఆయా రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తారు రోజుకు 1200 నుంచి 1300 మంది భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది శ్రీశైలం దేవస్థానం.


భక్తులు తమ ఆధార్ కార్డు ద్వారా ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ పొందవచ్చు. క్యూలైన్‌లో ఆధార్ కార్డు చూపిస్తే.. ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ మంజూరు చేసేలా శ్రీశైలం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆధార్ కార్డు నమోదు లేకుండానే భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం అవకాశం కల్పించారు.


మరోవైపు మల్లన్న స్పర్శ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా సంప్రదాయ వస్త్రధారణతోనే రావాలని శ్రీశైలం దేవాలయ అధికారులు కోరుతున్నారు.భక్తులకు మల్లికార్జునస్వామిని స్పర్శించే అవకాశం శ్రీశైలం, కాశీలో మాత్రమే ఉందన్న అధికారులు.. భక్తుల కోరిక మేరకు క్యూలైన్‌లో వచ్చే వారి ఆధార్ కార్డు ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ సెలవులు, పండుగలు, పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వంటి సమయాల్లో ఈ ఉచిత స్పర్శ దర్శనాలను నిలిపివేస్తామని శ్రీశైలం ఆలయ అధికారులు వెల్లడించారు. ఆయా రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa