ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి అపూర్వమైన, భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. తిమ్మరాజుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన సీఎంను చూసి స్థానికులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. మహిళలు హారతులిచ్చి, తిలకం దిద్ది ఆత్మీయంగా తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్థులు, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన రోజులను గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.గ్రామ పర్యటనలో భాగంగా ఓ వృద్ధుడు సీఎం చంద్రబాబును చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "అయ్యా, శ్రీరాముడు అజ్ఞాత వాసం చేసినట్టే, మీరు కూడా చేయని తప్పునకు 53 రోజులు అజ్ఞాత వాసం చేశారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులూ తాను ఉపవాసం ఉన్నానని ఆ వృద్ధుడు చెప్పడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు. దీనికి స్పందించిన చంద్రబాబు "మీలాంటి వారి అభిమానం, ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి" అని అన్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసమే ప్రభుత్వం 'పీ-4' పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు.చంద్రబాబు పిలుపునకు గ్రామంలో తక్షణ స్పందన లభించింది. తిమ్మరాజుపల్లికి చెందిన చల్లా మంజు, చల్లా బాల సుబ్రమణ్యం అనే ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి, తమ శక్తి మేరకు కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆదుకుంటామని ప్రకటించారు. వారి నిర్ణయాన్ని అభినందించిన చంద్రబాబు "మీలాంటి వారి కోసమే నేను అన్వేషిస్తున్నాను. ధనవంతులు పేదల బాధ్యత తీసుకుంటే రాష్ట్రంలో పేదరికం అనేదే ఉండదు. 'పీ-4' ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం" అని తెలిపారు. పర్యటనలో భాగంగా మరికొందరు గ్రామస్థులు గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa