వైభవ్ సూర్యవంశీ ఇప్పుడీ పేరు అంతర్జాతీయ క్రికెట్లో మార్మోగుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. తాజాగా యూత్ వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. శనివారం ఇంగ్లండ్లోని వోర్సెస్టర్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగో యూత్ వన్డేలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, యూత్ వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కమ్రాన్ గులామ్ (53 బంతులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్, 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు చేసి బెన్ మేయస్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఈ సిరీస్ ఆసాంతం వైభవ్ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లలో 306 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదే సిరీస్లోని మూడో వన్డేలో కేవలం 31 బంతుల్లోనే 9 సిక్సర్లతో 86 పరుగులు సాధించి తన విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు.ఇటీవల ముగిసిన 2025 ఐపీఎల్ సీజన్లోనూ వైభవ్ తనదైన ముద్ర వేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ కుర్రాడు, గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా, ఐపీఎల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్ స్టార్గా ఎదుగుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa