భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న జైషే మహ్మద్ అధిపతి మసూద్ అజార్ ఆచూకీపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత, ఆదేశ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజార్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెబుతూనే.. మరోవైపు బహుశా అతను ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే ఆయన నిజంగానే భారత దేశానికి హింట్ ఇచ్చారా లేక తమకు తెలియదని చెప్పారా అనేది అర్థం కావట్లేదు. అసలు ఈ విషయంపై ఎందుకు మాట్లాడారు, అసలేమేం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బిలావల్ భుట్టో.. భారత దేశంపై మరోసారి అసత్య ప్రచారాలు చేశారు. ముఖ్యంగా మసూద్ అజార్ జాడ గురించి మాట్లాడుతూ.. అఫ్ఘానిస్థాన్ జిహాద్లో పాల్గొన్న చరిత్రను గుర్తుచేశారు. అందువల్లే అతడు ఆ దేశంలోనే ఉండే అవకాశం ఉందని భుట్టో సూచించారు. అజార్ పాకిస్థాన్ గడ్డపై ఉన్నాడనేందుకు భారత్ నిర్దిష్ట ఆధారాలు సమర్పిస్తే.. అతడిని అరెస్టు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటన పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందనే ఆరోపణలను ఎప్పటిలాగే తోసిపుచ్చినట్లు అయింది.
మసూద్ అజార్పై భారత్లో పలు పెద్ద ఉగ్రదాడుల్లో ప్రమేయం ఉన్న ఆరోపణలు ఉన్నాయి. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘటనలకు ఇతడే సూత్రధారి అని భారత్ బలంగా విశ్వసిస్తోంది. 1999లో కంధార్ విమానం హైజాక్ అయిన తర్వాత ఇతడిని విడుదల చేయడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది. భారత్ ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను.. ముఖ్యంగా జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లోనే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారు. దీనిపై ఆయన స్పందించి.. తన వాళ్లు చనిపోవడంపై తనకెలాంటి బాధ లేదని కూడా చెప్పారు. ఇలాంటి సమయంలోనే భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
సింధూ నదీ జలాల ఒప్పందంపై కూడా బిలావల్ భుట్టో ఇటీవల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. భారత్ నీటిని నిరాకరిస్తే యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే భారత కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఈ బెదిరింపులను కొట్టిపారేస్తూ.. వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ విషయంలో పాకిస్థాన్ స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోవడం, మసూద్ అజార్పై ఇటువంటి ప్రకటనలు చేయడం భారత్-పాక్ సంబంధాలపై మరింత ప్రభావం చూపుతోంది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందా అనే ప్రశ్నలను మరోసారి లేవనెత్తాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa