ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టంగా మారిన ట్రంప్ కలల బిల్లు.. భారతీయులకు ఇక కష్టాలు తప్పవా

international |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 10:57 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకువచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఎట్టకేలకు చట్టసభల ఆమోదం పొంది చట్టంగా మారింది. సెనేట్‌లో దీనిపై చర్చ జరిగింది. ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలిపింది. ట్రంప్ సంతకంతో చివరకు చట్టంగా మారింది. దీనిపై రిపబ్లికన్ సభ్యులు, అమెరికా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం పన్నుల్లో కోత, ఖర్చులను నియంత్రించడం. బిల్లు చట్టంగా మారిన సందర్భంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ చట్టం అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు.


బిల్లు ఆమోదం కోసం పెట్టిగా.. సభలో ముగ్గురు రిపబ్లికన్‌లు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా చివరకు 51-50 తేడాతో బిల్లు గెలిచింది. ఈ బిల్లు ఆమోదంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక పాత్ర పోషించారు. ఆయన టై బ్రేకర్‌గా వ్యవహరించి బిల్లును ఆమోదింపజేశారు. ప్రతినిధుల సభలో కూడా బిల్లుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. అక్కడ కూడా ఇద్దరు రిపబ్లికన్లు బిల్లును వ్యతిరేకించారు.


ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఈ చట్టం అందరికీ మేలు చేస్తుందన్నారు. సైనికుల నుండి సాధారణ ఉద్యోగుల వరకు అందరికీ ఈ చట్టం మద్దతుగా ఉంటుందని తెలిపారు. చట్టం ఆమోదంలో పొందడంలో కీలక పాత్ర పోషించిన ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్‌కు, సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను తగ్గింపులు చేసిందని, ఖర్చులను తగ్గించిందని, సరిహద్దు భద్రత కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టిందని ఆయన అన్నారు. ఈ చట్టం వల్ల అమెరికా ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.


బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా ఆమోదం పొందడంతో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించారు. ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, సైనిక కుటుంబాలు, వైట్‌హౌస్‌ సిబ్బంది చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు ఆకాశంలో విన్యాసాలు చేశాయి.


ఈ చట్టం ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తుంది. కఠినమైన వలస చట్టాలను అమలు చేయడానికి నిధులు ఇస్తుంది. పన్ను తగ్గింపులను శాశ్వతం చేస్తుంది. అయితే ఈ చట్టం వల్ల చాలా మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల లక్షలాది మందికి నష్టం వాటిల్లుతుందని విశ్లేషిస్తున్నారు. అలానే ఈ చట్టం అమెరికాలోని ఎన్నారైలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.


ఎన్నారైలపై ప్రభావం..


ఈ చట్టం ద్వారా 2026, జనవరి 1 నుంచి యూఎస్ నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1 శాతం పన్ను విధించనున్నారు. వినడానికి ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది. ఫలితంగా ఇక్కడి భారతీయ గృహ అవసరాలతో పాటుగా బ్యాంకింగ్ వ్యవస్థ, విదేశీ మారక ద్రవ్యం మీద ప్రభావం చూపుతుంది. ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. అలానే వీసా ఫీజులు కూడా పెరిగాయి. హెచ్-1బీ, Lఎల్-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. అక్రమంగా వచ్చిన వారిపై పెద్ద ఎత్తున జరిమానాలు విధించేందుకు అవకాశం లభిస్తుంది.


వీటితో పాటుగా తక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల కోసం అందించే మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలు విధించబడ్డాయి. అలానే సౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.


ఈ బిల్లు వల్ల ఎవరికి లాభం అంటే..


టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు, కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాల వారు ఈ బిల్లు వల్ల లాభపడతారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ బిల్లు వల్ల సంపన్నులకు లాభం.. సామాన్యులకు నష్టం అని విమర్శిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa