ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌లోని గయా జిల్లా పాఠశాలలో దారుణ ఘటన

national |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 08:15 PM

బిహార్‌లోని గయా జిల్లాలో ఒక పాఠశాల ప్రాంగణంలోనే దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడిని కొట్టాడన్న ఆగ్రహంతో ఓ విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడుతుండగా, రాకేశ్ రంజన్ శ్రీవాస్తవ అనే ఉపాధ్యాయుడు వారిని వారించి చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆ విద్యార్థులలో ఒకరు ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు.వెంటనే తరగతులు జరుగుతుండగానే విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాలలోకి దూసుకొచ్చారు. టీచర్ రాకేశ్ రంజన్‌ను గుర్తించి ఆయనపై పిడిగుద్దులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఉపాధ్యాయుడు ధర్మేంద్ర కుమార్‌ను కూడా చితకబాదారు. ఈ హఠాత్పరిణామంతో పాఠశాల ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. విద్యార్థులు భయంతో తరగతి గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన ఉపాధ్యాయులు రాకేశ్ రంజన్, ధర్మేంద్ర కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాకేశ్ చేతికి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిని పాఠశాల హెడ్‌మాస్టర్ పంకజ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది విద్యావ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa