ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. దాంతో దిగువకు నీళ్లు వదలాల్సి రావడం, తొలకరి కూడా పలకరించడంతో ముఖ్యమంత్రి మంగళవారం జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోని 6, 7, 8, 11వ నెంబర్ గేట్లు ఎత్తివేసి అనంతరం నీటి వినియోగదారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ రతనాల సీమ కావాలంటూ శ్రీశైల మల్లన్నకు పూజలు చేశానని చెప్పారు. ఎగువ నుంచి వచ్చిన 200 టీఎంల నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉందన్నారు. ప్రస్తుతం జలాలే మన సంపద అని.. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని కొనియాడారు. రాయలసీమను కాపాడలేరని గతంలో చాలామంది ఎద్దేవా చేశారని, సీమ స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్ నడుం బిగించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ కల్లా ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ విధించానని, 30వ తేదీకి కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశామని.. పోతిరెడ్డిపాడు, గాలేరు - నగిరి, గండికోట అన్నీ తమ హయాంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పారు.
సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, దాంతో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆలోచన చేశారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలనేదే తన లక్ష్యమన్నారు. రాయలసీమకు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయంటే అది పోలవరం వల్లేనన్నారు. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తిని ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్నామని.. ఇప్పుడు పాలిష్డ్ రైస్ తిని షుగర్ వ్యాధులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. రాయలసీమలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు పండుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa