ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత బౌలింగ్ విభాగం ఇంగ్లండ్ కంటే పటిష్టమన్న అజారుద్దీన్

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 06:16 PM

ఇంగ్లండ్‌తో చారిత్రక లార్డ్స్ మైదానంలో మూడో టెస్టు నేపథ్యంలో, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో భారత బౌలింగ్ విభాగం ఇంగ్లండ్ కంటే చాలా పటిష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు."బర్మింగ్‌హామ్‌లో జట్టు అద్భుతంగా ఆడింది. ఆ గెలుపుతో లభించిన ఆత్మవిశ్వాసంతో నేడు బరిలోకి దిగుతోంది. బుమ్రా తిరిగి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతం మన బౌలింగ్ ఇంగ్లండ్ కంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలుస్తుందని ఆశిస్తున్నాను" అని అజారుద్దీన్ అన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలతో 146.25 సగటుతో 585 పరుగులు చేశాడు. మరో 18 పరుగులు చేస్తే, ఇంగ్లండ్‌లో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రాహుల్ ద్రవిడ్ 2002లో 602 పరుగులు రికార్డును గిల్ అధిగమిస్తాడు. గత మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా, మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లు, ఆకాశ్ దీప్ 10 వికెట్లతో చెలరేగారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా కూడా జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగం మరింత పదునెక్కింది.ఇక లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ జట్టులో సైతం ఒకే మార్పు చోటుచేసుకుంది. గాయాల కారణంగా నాలుగేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. లార్డ్స్‌లో భారత్‌కు రికార్డు అంత గొప్పగా లేదు. ఇక్కడ ఆడిన 19 టెస్టుల్లో కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa