టిబెటన్ల తదుపరి ఆధ్యాత్మిక గురువు దలైలామా ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి పాత్ర ఉండదని, దలైలామా వారసుడు చైనా నుంచి రాడని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తేల్చి చెప్పారు. భవిష్యత్తు దలైలామా స్వేచ్ఛా ప్రపంచం నుంచే వస్తారని, ప్రజాస్వామ్య విలువలు లేని చైనా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియపై చైనా చేస్తున్న వాదనలను పెమా ఖండూ తోసిపుచ్చారు. “చైనా ఈ విషయంపై ఎందుకు అభ్యంతరం చెబుతోందో నాకు అర్థం కావడం లేదు. దలైలామా వ్యవస్థ చైనాలో లేదు. దానిని ప్రధానంగా హిమాలయ ప్రాంతంలోని టిబెటన్ బౌద్ధులు మాత్రమే గుర్తిస్తారు. కాబట్టి ఇందులో చైనాకు ఎలాంటి పాత్ర లేదు,” అని ఆయన అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించే దేశం నుంచే తదుపరి దలైలామా వస్తారని ఖండూ వివరించారు.ప్రస్తుత 14వ దలైలామా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన 130 ఏళ్ల వరకు జీవిస్తారని ఆయనే స్వయంగా చెప్పారని పెమా ఖండూ గుర్తుచేశారు. దలైలామా దీర్ఘాయుష్షుతో ఉండాలని తామంతా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత దలైలామా కాలం చేసిన తర్వాతే, సుమారు 600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ పద్ధతుల ప్రకారం తదుపరి వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa