మహారాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సాత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రైవేట్ గదిలో అర్ధనగ్నంగా సిగరెట్ తాగుతుండగా.. పక్కనే నగదు బ్యాగులాంటింది ఉండటంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియోను ప్రత్యర్థి శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసి, అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను చూస్తే బాధగా ఉంది. ఆయన మరెంతకాలం ఈ అవమానాలను చూస్తూ మౌనంగా ఉంటారో’’ అంటూ రౌత్ వ్యగ్యంగా కామెంట్ చేశారు. రెండు రోజుల కిందట శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడిచేసిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి సంజయ్ షిర్సాత్ .. ‘‘వీడియోలో ఉన్న బ్యాగ్లో ఎలాంటి నగదు లేదు, నా బట్టలే ఉన్నాయి. నేను తప్పేమీ చేయలేదు. కొందరు నాపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై నాకు నోటీసు వచ్చింది. సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సమయం కోరాను’’ అని అన్నారు. అయితే పక్కనే బ్యాగ్ ఉండటం, ఐటీ నోటీసు జారీ నేపథ్యంలో వీడియో బయటకు రావడంతో వివాదానికి దారితీసింది. కాగా,ఇటీవల ప్రతిపక్ష ఎంఎన్ఎస్ ర్యాలీలో మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయిక్ పాల్గొనడం చర్చనీయాంశమైంది.
ఈ వీడియోపై ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పిస్తూ.. ‘‘ఈ రోజు సంజయ్ షిర్సాట్ లోటస్ పాయింట్లో మంచంపై సిగరెట్ తాగుతూ కనిపించారు.. పక్కనే నగదు నిండిన బ్యాగ్ ఉంది. ఇది ఎవరిచ్చారు? ఎవరి డబ్బు? ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఏమైనా చర్య తీసుకుంటుందా? సీఎం ఫడ్నవిస్ ఆదేశాలతో ఏదైనా జరగబోతోందా?’’ అని ప్రశ్నించారు.
ఐటీ నోటీసులపై గందరగోళం
సంజయ్ షిర్సాత్ మొదట్లో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రికాంత్ షిండేకి కూడా ఐటీ నోటీసు వచ్చిందని అన్నారు. తర్వాత వెంటనే మాట మార్చారు. ‘మీడియా అడిగిన పిచ్చి ప్రశ్నకు అలా స్పందించాను. నాకు ఆయనకు ఐటీ నోటీసుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’ అని ప్రకటించారు. ముంబయిలో మరాఠీయేతరులపై దాడులు సహా వరుస పరిణామాలు దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు తలనొప్పిగా మారాయి.
ఇటీవల చత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి షిర్సాత్.. నల్లధనం గురించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై సభలో నవ్వులు పూయించినా.. ప్రతిపక్షాలపై తీవ్రంగా స్పందించాయి. తర్వాత ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తాను జోక్ చేశానని, ఎటువంటి తప్పుచేయలేదని సంజాయిషీ ఇచ్చారు. గత ఐదేళ్లలో మంత్రి ఆర్థికంగా ఎదిగిన తీరుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ అమాత్యుడు పైసా తీసుకోకుండా ఏ పని చేయ్యడనే ప్రచారం జరుగుతోన్న వేళ.. ఆయనకు ఐటీ నోటీసులు రావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa