పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ను పక్కనపెట్టి, మునీర్ స్వయంగా అంతర్జాతీయ పర్యటనలు చేస్తూ దేశ విధానాలను నిర్దేశిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ఆయన అమెరికా, శ్రీలంక, ఇండోనేసియా వంటి దేశాల్లో పర్యటించడం, షరీఫ్ను దాదాపు విస్మరిస్తూ నడిచిన వైఖరి ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
ఆసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం, ఆయన అధికారం అపూర్వంగా పెరిగినట్లు సూచిస్తోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే ఒక సైనికాధికారికి ఈ హోదా లభించడం, ఇది ఆయన దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారినట్లు సంకేతం. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని తొలగించి, మునీర్ స్వయంగా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కుట్రలు చేస్తున్నారనే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, షెహబాజ్ షరీఫ్ నాయకత్వం పూర్తిగా నీరసించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు పాకిస్తాన్లో మరోసారి సైనిక పాలనకు దారితీసే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి. 1977లో జియా-ఉల్-హక్ చేపట్టిన సైనిక తిరుగుబాటు లాంటి సంఘటనలు మళ్లీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, మునీర్ అధికారం మరింత బలపడితే, దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం దేశ రాజకీయ భవిష్యత్తును గాఢంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa