లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్లో బంతి వివాదం కలకలం రేపింది. రెండో రోజు ఆటలో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అంపైర్లతో తీవ్రంగా వాదించారు. డ్యూక్స్ బంతి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసిన భారత జట్టు, దాన్ని మార్చాలని కోరింది. ఈ వివాదం ఆటలో ఆసక్తికరమైన మలుపును తీసుకొచ్చింది.మ్యాచ్లో 91వ ఓవర్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో డ్యూక్స్ బంతి ఆకారం కోల్పోయిందని, స్వింగ్ తగ్గిందని భారత జట్టు ఫిర్యాదు చేసింది. అంపైర్ పాల్ రీఫెల్ బంతిని హూప్ టెస్ట్లో పరిశీలించి, మార్పిడికి అంగీకరించారు. అయితే, కొత్తగా ఇచ్చిన బంతి కూడా 10 ఓవర్ల బంతిలా కాకుండా, 20 ఓవర్ల పాతదిగా కనిపించిందని గిల్, సిరాజ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. "ఇది 10 ఓవర్ల బంతా సీరియస్గానే అంటున్నారా ఈ మాట?" అని సిరాజ్ అంపైర్ ను ప్రశ్నించడం స్టంప్ మైక్లో వినిపించింది. గిల్ కూడా అంపైర్తో తీవ్రంగా వాదించి, బంతిని లాక్కున్నాడు. కామెంటరీ బాక్స్లో సునీల్ గవాస్కర్ కూడా భారత జట్టు వాదనను సమర్థించారు. ఈ వివాదంపై డ్యూక్స్ బంతి తయారీదారు దిలీప్ జజోడియా స్పందిస్తూ, ఆటగాళ్లు మరింత ఓపికతో, సహేతుకంగా వ్యవహరించాలని కోరారు. "బంతి తయారీలో సహజమైన ముడిసరుకు వాడతాం. దీనివల్ల ప్రతి బంతి పరిపూర్ణంగా ఉండదు. ఆధునిక బ్యాట్లు శక్తివంతంగా ఉండటం, ఆటగాళ్లు బలంగా షాట్లు కొట్టడం వల్ల బంతి త్వరగా దెబ్బతింటోంది" అని జజోడియా వివరించారు. బంతి గట్టిగా ఉండేలా తయారుచేస్తే బ్యాట్లు విరిగిపోతాయని, ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. భారత్లో డ్యూక్స్ బంతుల వినియోగాన్ని విస్తరించేందుకు బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు.కాగా, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ టీమిండియా సారథి గిల్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. "బంతి స్వింగ్ అవుతుంటే దాన్ని ఎందుకు మార్చారు ఆ సమయంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు" అని హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించాడు. ఈ వివాదం ఆటలో ఆసక్తిని పెంచినప్పటికీ, డ్యూక్స్ బంతి నాణ్యతపై చర్చలు మరింత ఊపందుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa