ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారికి కొత్తగా పింఛన్లు.... నెలకు రూ.5000!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 06:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించనుంది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా.. తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనుంది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. ఈ 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.


మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014- 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు రూ.2500 పింఛన్ రూపంలో అందించగా.. ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.


అమరావతిలో 19 వేలమంది వరకూ భూమిలేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు. ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20 వేలు దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది.


 ఇక అమరావతిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకోసం రెండోసారి భూమిని సమీకరించే ఆలోచనలో ఉంది. రాజధాని భవిష్యత్తు అవసరాల కోస మరింత భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అమరావతి ఎయిర్‌పోర్టు కోసం 5000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2500 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa