ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు కట్ చేస్తారనే భయంతో ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లిన వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 09:14 PM

అతడో సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ప్రతీ నెలా వచ్చే కరెంటు బిల్లులు కట్టడం మానేశాడు. ఇలా చాలా నెలలుగా చేస్తున్నా.. సిబ్బంది మాత్రం వెంటనే డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. పదే పదే వారిని బతిమాలుతూ.. రేపు కట్టేస్తా, మాపు కట్టేస్తా అంటూ సదరు వ్యక్తి కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఇలా బకాయిలు లక్షన్నర కాగా.. ఇక ఈనెల కచ్చితంగా విద్యుత్ సరఫరా ఆపేస్తారని భయపడ్డాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని అతడు.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్‌నే దొంగిలించాడు. ఎవరూ చూడని సమయంలో తీసుకువచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


విద్యుత్ బిల్లులు చెల్లించకుండా.. కరెంటు సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఒక రైతు ఏకంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌నే దొంగిలించిన వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. రావత్‌పురా గ్రామానికి చెందిన శ్రీరామ్ బిహారీ త్రిపాఠి అనే రైతుకు.. అస్వార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ గ్రాంట్ కింద తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను తన పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) యాజమాన్యంలో ఉంది. అయితే శ్రీరామ్ బిహారీ త్రిపాఠి చాలా కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో.. రూ. 1,49,795 బిల్లు బకాయి పడింది. దీంతో సిబ్బంది ఎలాగైనా తన విద్యుత్ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉందని భావించి ఓ వింత ఆలోచన చేశాడు.


తన కుమారుడు సోను త్రిపాఠి సహాయంతో.. త్రిపాఠి ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లోనే పెట్టుకుని తనకింక అస్సలే విద్యుత్ సరఫరా ఆపేయలని సంబుర పడిపోయాడు. కానీ ఈ ఘటన వెలుగులోకి రావడంతో అస్వార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ సోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తరలించినందుకు 2003 విద్యుత్ చట్టంలోని సెక్షన్ 136 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే దర్యాప్తును కూడా ప్రారంభించారు.


శ్రీరామ్ బిహారీ త్రిపాఠియే ట్రాన్స్‍ఫార్మర్ దొంగిలించాడని తెలిసినప్పటికీ.. దొంగిలించబడిన ట్రాన్స్‌ఫార్మర్‌ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుగుతోంది. భారీ బకాయిలు పేరుకుపోయినందున విద్యుత్ కనెక్షన్ కట్ అవుతుందనే భయంతో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌నే దొంగిలించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంలో ఇది ఒక కొత్త సవాలును విసురుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa