ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్డ్ ఇంజనీర్ హత్య,,,సంచలన విషయాలు వెలుగులోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 07:45 PM

విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అనూష అనే పనిమనిషి.. రామారావు అనే రిటైర్డ్ ఇంజనీర్‌ను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో మాచవరం పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భర్త ఉపేంద్ర సాయంతో పనిమనిషి అనూష యజమాని అయిన రిటైర్డ్ ఇంజనీర్ రామారావును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా అనూష బ్యాక్ గ్రౌండ్ తనిఖీ చేసిన పోలీసులకు కఠోర వాస్తవాలు తెలిసి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..


అనూష స్వస్థలం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెం. అనూష అలియాస్ పల్లపు మంగకు 12వ ఏటనే పెళ్లి జరిగింది.12 ఏళ్లు వయసు ఉన్నప్పుడే అనూష, రమేష్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఐదేళ్ల కిందట అనూష.. భర్త రమేష్, పిల్లలను వదిలేసి విజయవాడకు వచ్చేసింది. అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ కొంతకాలం గడిపింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు అనూష మకాం మార్చింది. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో డేటింగ్ యాప్‌లో రాజా అనే వ్యక్తి అనూషకు పరిచయమయ్యాడు. దీంతో అనూష అలియాస్ పల్లపు మంగ.. రాజాను రెండో పెళ్లి చేసుకుంది. ఏడాది గడిచిన తర్వాత ఏం జరిగిందో ఏమో.. రాజాను కూడా అనూష వదిలేసింది.


అయితే డేటింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి అనూషకు పరిచయం అయ్యాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తి డేటింగ్ యాప్‌లో అనూషకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే నెలాఖరులో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ రామారావు ఇంట్లో ఇటీవల కేర్ టేకర్‌గా చేరింది అనూష. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే రామారావు ఇంట్లో భారీగా డబ్బులు, నగలు ఉంటాయనే ఆలోచన వచ్చింది అనూషకు. ఆ ఆలోచనే క్రూరమైన పని చేసేలా చేసింది.


రామారావును అడ్డు తొలగించుకుంటే భారీగా నగలు, డబ్బులు దక్కుతాయని మూడో భర్త అయిన ఉపేంద్రకు నచ్చజెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న రామారావును ఇద్దరూ కలిసి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మంచం మీద కారం చల్లారు. అనంతరం ఇంట్లో డబ్బులు, నగలు కోసం గాలించగా ఎలాంటివి లభించలేదు. దీంతో బీరువాలో ఉండే రూ.50000 తీసుకుని పరారయ్యారు. అయితే ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతికత సాయంతో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa